Mann Ki Baat: మన్ కీ బాత్… మనసులోని మాట… ప్రధాని మోదీ ఆలోచనలకు ఆకాశవాణి వేదికైంది. దేశం గురించి… మట్టి మనుషుల గురించి ప్రధాని తన మాటల్లో చెప్పడం, దేశం గొప్పతనం గురించి వివరించడం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విషయాల ప్రస్తావన.. రాజకీయాలకు దూరంగా.. ప్రజల మనసులకు దగ్గరగా మన్ కీ బాత్ సాగుతోంది. ఆదివారం వందో ఎపిసోడ్ ప్రసారం కానుంది. సెంచరీ ఎపిసోడ్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశాయి బీజేపీ శ్రేణులు.
అక్టోబర్ 3, 2014.. మోదీ మన్ కీ బాత్ మొదలైన రోజు. దేశంలో ఎంతో ఎఫెక్ట్ చూపిస్తున్న ప్రోగ్రామ్స్ లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఇప్పుడు జమానా మారింది. అంతా సెల్ ఫోన్లు, కంప్యూటర్ల యుగం ఇది. అయితే మూలన పడేసిన రేడియోకు దుమ్ము దులిపి మళ్లీ వినేలా చేశారు మోదీ. ఈ కాలంలో ముఖ్యంగా యువత పట్టించుకోని రేడియో వేదికగా ప్రధాని తన సందేశాన్ని దేశ ప్రజలకు వినిపించడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి మోదీ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత అసలు ఈ రేడియోను ఈ కాలంలో ఎవరు వింటారన్న ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ అదే రేడియో వేదికగా హిట్ కొట్టారు మోదీ. ఆదరణ లేకపోతే వందో ఎపిసోడ్ దాకా వచ్చేదా అన్న ప్రశ్నలూ ఉన్నాయి.
మొదట్లో మన్ కీ బాత్ అంటే అదేదో రాజకీయాలకు వేదిక అవుతుందనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఒక్క పొలిటికల్ వర్డ్ కూడా ప్రధాని మాట్లాడలేదు. ఈ ఎపిసోడ్ ను దేశాన్ని ఏకం చేసేందుకు వినియోగించుకున్నారు. అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని మతాలు, అందరి వాయిస్ ను తన వాయిస్ తో వినిపించారు. కవులు, చిరు కళాకారులు, ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన వారు… ఇలా ఎన్నెన్నో రంగాల్లో ప్రతిభ ఉన్నా మగ్గిపోతున్న వారి గురించి ప్రస్తావించారు. అసలు ఇది ఎవరూ ఊహించలేకపోయారు. కానీ మోదీ మాత్రం చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరి గురించి ప్రస్తావిస్తూ మన్ కీ బాత్ ను ఉత్సాహంగా నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 99 ఎపిసోడ్స్ లో 500 మందికి పైగా భారతీయుల పేర్లను ప్రస్తావించారు.
మన్ కీ బాత్ లో ప్రధాని హిందీలో మాట్లాడుతారు. అయితే దీన్ని 23 భారతీయ భాషలు మరో 29 మాండలికాల్లోకి ట్రాన్స్ లేట్ చేస్తున్నారు. వీటితో పాటే 11 విదేశీ భాషల్లోకి తర్జుమా చేసి ప్రసారం చేస్తున్నారు. వాతావరణం, పర్యావరణం, స్వచ్ఛత, పరిశుభ్రత, ఇతర సామాజిక అంశాలను ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావిస్తూ వచ్చారు. పిల్లల పరీక్షలకు సంబంధించిన విషయాలనూ మోదీ షేర్ చేసుకుంటున్నారు. మనదేశంలో ఉన్న ప్రత్యేకతల గురించి కూడా ప్రస్తావించారు. ఎవరికీ తెలియని విషయాలను షేర్ చేశారు.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేపట్టిన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ఇప్పటి వరకూ 99 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ బడావో, జల సంరక్షణ, ఆయుష్, ఖాదీ, వ్యవసాయ, కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఇలాంటి అంశాలు ఆయా ఎపిసోడ్లో ప్రస్తావించడం, అంతగా గుర్తింపునకు నోచుకోని వ్యక్తులను వెలుగులోకి తేవడంతో ఈ రేడియో ప్రోగ్రాం జనానికి దగ్గరైంది. ప్రతి నెలా చివరి ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియా, డీడీ నెట్వర్క్లో ‘మన్ కీ బాత్’ ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమంతో ప్రసార భారతికి రేటింగ్ కూడా పెరిగినట్లయింది.
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ కు గుర్తుగా వంద రూపాయల కాయిన్ సహా స్టాంప్ ను రిలీజ్ చేస్తున్నారు. వంద రూపాయల కాయిన్ను వెండి, రాగి, నికెల్, జింక్తో తయారు చేశారు. కాయిన్ ముందు అశోక స్తంభం ఉండనుంది. దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది.