India And UK:- ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో మాత్రం అభివృద్ధి చెందిన దేశాలు సైతం తిరిగి చూసేలాగా ముందుకెళ్తోంది. అందుబాటులో ఉన్న వనరులతోనే అత్యున్నత స్థాయిని అందుకునే ప్రయత్నాలు చేస్తుంది ఇండియా. అందుకే ఇతర ప్రపంచ దేశాలు కూడా ఇండియాతో కలిసి పనిచేయడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా యూకే కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం ఇండియాతో చేతులు కలిపింది.
ఇండియా, యూకే సైన్స్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మీటింగ్లో ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నట్టు యూనియన్ మినిస్టర్ స్వయంగా ప్రకటించారు. ‘నెట్ జీరో’ అనే పేరుతో ఈ రెండు దేశాలు కలిసి ఒక ఇన్నోవేషన్ వర్చువల్ సెంటర్ను స్థాపించనున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ సక్సెస్ తర్వాత ప్రపంచమంతా ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని తిరిగి చూసింది. ఆ తర్వాత కూడా టెక్నాలజీ పరంగా ఇండియా ఎన్నో మైళురాళ్లను తాకింది. అందుకే యూకేతో పాటు మరెన్నో దేశాలు కూడా ఇండియాతో కలిసి పనిచేయడానికి ముందుకొస్తున్నాయి.
ఇప్పటికే ఇండియా, యూకే కలిసి ‘రోడ్మ్యాప్ 2030’ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ రెండు దేశాలకు సంబంధించిన వివిధ సెక్టార్లు.. అంటే హెల్త్, వాతావరణం, ట్రేడ్, ఎడ్యూకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్.. ఇలా అన్ని రంగాల్లో రోడ్మ్యాప్ 2030లో భాగంగా పనిచేయనున్నాయి. రోడ్మ్యాప్ 2030 తర్వాత ఇండియా, యూకే కలిసి చేస్తున్న అతిపెద్ద రెండో ప్రాజెక్ట్ అంటే నెట్ జీరో అని ప్రభుత్వాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. రోడ్మ్యాప్ 2030, నెట్ జీరో ద్వారా ఇండియా, యూకే మధ్య సంబంధాలు మరింత మెరుగు అవుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
నెట్ జీరో ఇన్నోవేషన్ వర్చువల్ సెంటర్ను ఇండియా, యూకే ప్రభుత్వాలు వెంటనే సమ్మతించాయి. రెండు దేశాల నుండి స్టేక్హోల్డర్స్ను ఆహ్వానించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని వారు అనుకుంటున్నారు. నెట్ జీరో జర్నీని ఎంత వీలైతే.. అంత తొందరగా ప్రారంభించాలని భావిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాదు.. ఆర్&డీ ప్రాజెక్ట్స్లో కూడా ఇండియా, యూకే కలిసి నడవాలి అన్న ఆలోచనలు ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.