Congress : నల్గొండలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రానికి తొలిసారి రానుండటంతో… పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల ప్రజలను, నిరుద్యోగులను జిల్లా కేంద్రానికి తరలించేందుకు పార్టీ ప్రముఖులకు బాధ్యతలు అప్పగించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపడుతున్న నిరసన ర్యాలీలో నియోజకవర్గాల వారీగా ప్రజలు పాల్గొనేలా ముందస్తు ప్రణాళిక రూపొందించారు.
సాయంత్రం 4 గంటలకు నల్గొండ MG వర్సిటీ నుంచి రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభం కానుంది. విద్యార్థులతో చర్చల్లో పాల్గొని అక్కడి నుంచి మర్రిగూడ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి గడియారం కేంద్రం వరకు సుమారు 2 కిలోమీటర్లు నిరసన ర్యాలీ నిర్వహిస్తారు. గడియారం కేంద్రంలో కార్నర్ సభలో పాల్గొంటారు. రేవంత్రెడ్డికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేయనున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా అన్న అంశంపై సందేహాలున్నాయి. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎంపీ కోమటిరెడ్డి కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీలో తాను పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. తమ క్యాడర్ పూర్తిగా పాల్గొంటుందని ఇప్పటికే పీసీసీకి చెప్పినట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా ? లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది.
నిరుద్యోగ నిరసన ర్యాలీలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఖమ్మం, ఆదిలాబాద్ లో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు యువత స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.