ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో 30 ఏళ్లపాటు లీజుకు ప్రభుత్వం అప్పగించింది. తొలుత 4 కంపెనీలు టెండర్ల కోసం బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక,ఆర్థిక బిడ్ల పరిశీలన తర్వాత ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎల్1గా నిలిచింది. రూ.7,380 కోట్లకు బిడ్ ఖరారైంది. ఐఆర్బీ ఇన్ఫ్రా ఈ మొత్తాన్ని ఒకే విడతలో ప్రభుత్వానికి అందిస్తుంది. ఇక నుంచి ORR నిర్వహణ , టోల్ వసూలు ఈ సంస్థ పరిధిలోనే ఉంటాయి.
ORRను హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్లు నిర్మించారు. పలు జాతీయ, రాష్ట్ర రహదారులు ORRకు అనుసంధానం చేశారు. వాహనాలు ORR పైకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు 44 పాయింట్లు, 22 ఇంటర్ ఛేంజ్ జంక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ రహదారిపై రోజూ 1.30 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్ వసూళ్ల ద్వారా ఏడాదికి రూ.400-450 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. అలాగే టోల్ ఛార్జీలను ఏటా 5 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇచ్చేందుకు హెచ్ఎండీఏ ఏడాదిగా కసరత్తు చేస్తోంది. టెండర్లను పిలిచి బిడ్ల దాఖలుకు ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు విధించింది. బిడ్లు దాఖలు చేసేందుకు తొలుత 11 కంపెనీలు ఆసక్తి చూపించాయి. చివరకు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, దినేశ్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్లు పోటీ పడ్డాయి. ఈ నాలుగు సంస్థల్లో ఎక్కువ మొత్తానికి బిడ్ దాఖలు చేసిన ఐఆర్బీ ఇన్ఫ్రా లీజును దక్కించుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులను టీవోటీ పద్ధతిలో లీజుకు అప్పగించారు. ఇదే విధానాన్ని హెచ్ఎండీఏ అనుసరించింది.
ఇప్పటి వరకు ORR నిర్వహణను హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ నిర్వహిస్తోంది. విద్యుత్ లైట్లు, ఇంటర్ ఛేంజ్లు, సర్వీస్ రహదారుల నిర్వహణ, మరమ్మతులు, భద్రతను పర్యవేక్షిస్తోంది. నిధులు, సిబ్బంది కొరతతో నిర్వహణ భారంగా మారింది. ఇక నుంచి లీజు పొందిన సంస్థే నిర్వహణ మొత్తాన్ని భరిస్తుంది. హెచ్జీసీఎల్ పర్యవేక్షణ బాధ్యతలను మాత్రమే చూస్తుంది. పెట్టుబడులకు తెలంగాణలో ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు ఓఆర్ఆర్ బిడ్ ను నిదర్శనంగా పేర్కొన్నారు.