Mobile Recharges:- హమ్మయ్య… వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచవు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పైగా దేశీయంగా టెలికాం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉంది. రీఛార్జ్ల ధరలు పెంచితే కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉండదు. పైగా పాత కస్టమర్లు కూడా మొబైల్ నెంబర్ పోర్టబులిటీ తీసుకోవచ్చు. అందులోనూ.. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ కంపెనీలు 5జీ నెట్ వర్క్ను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి.
5జీ బేస్ పెంచుకోడానికి జియో, ఎయిర్ టెల్ మధ్య విపరీతమైన పోటీ ఉంది. 4జీ నెట్ వర్క్ కస్టమర్లను 5జీలోకి తెచ్చేందుకు ఇప్పుడిప్పుడే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కంపెనీలు. ఇప్పుడు అన్ని మొబైల్ కంపెనీల టార్గెట్.. కస్టమర్లను 4జీ నుంచి 5జీలోకి తీసుకురావడమే. సో, ఆఫర్లు ఇస్తారే తప్ప ఈ సమయంలో టారిఫ్ ధరలు పెంచే అవకాశం కనిపించడం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశమంతటికీ 5జీ సర్వీసులు తీసుకొస్తామని రిలయన్స్ జియో చెబుతోంది. అటు ఎయిర్ టెల్ కూడా ఇదే పనిలో ఉంది.
టారిఫ్ల పెంపు లేకపోవడం కచ్చితంగా కంపెనీలకు నష్టమే. ఇప్పటికే 5జీ కోసం భారీగా పెట్టుబడి పెట్టి కూర్చున్నాయి. పెట్టిన పెట్టుబడికి తగ్గ రిటర్న్స్ రావడం లేదు. అయినా సరే.. 2024 లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందువల్ల టెలికం టారిఫ్లు పెరిగే సూచనలు కనబడటం లేదని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ చెబుతోంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చుపెడతాయి. పథకాల రూపంలో బెనిఫిట్స్ అందుతాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ఈ స్పెండింగ్ పెరుగుతుంది. అంటే, జనాల చేతుల్లోకి ఏదో విధంగా డబ్బులు వస్తాయి. సో, ఖర్చు పెట్టడానికి ప్రజలు కూడా వెనకాడరు. ఇలాంటి సమయంలో టారిఫ్స్ పెంచితే.. ప్రత్యర్థి కంపెనీలకు బెనిఫిట్ అవ్వొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే, ఎన్నికలయ్యేదాకా ఆ అవకాశం కనబడటం లేదని, 2025 ఫైనాన్షియల్ ఇయర్లోనే 4జీ ప్రీ పెయిడ్ టారిఫ్లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.