Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. సీబీఐ దర్యాప్తు ఎంపీ అవినాష్రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనేమో.. తననే టార్గెట్ చేస్తున్నారేంటి? వివేక ఫ్యామిలీలో అనేక గొడవలు ఉన్నాయి ఆ దిశగా దర్యాప్తు చేయట్లేదంటూ పదే పదే చెబుతున్నారు. వివేకా రెండో పెళ్లి, ఆస్తి పంపకాలు, వివేకా అల్లుడి హస్తం.. ఇలా రకరకాల ఆరోపణలు సీబీఐ ముందుంచుతున్నారు. సీబీఐ మాత్రం వివేకా హత్య కేసులో ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవంటోంది. ఎందుకైనా మంచిదని.. అవినాష్ ఆరోపణల తర్వాత సునీతను, ఆమె అల్లుడుని మరోసారి ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఈ సమయంలో వైఎస్ షర్మిల చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్గా మారాయి.
మా చిన్నాన్న హత్య ఆస్తుల కోసం అయితే జరగలేదని షర్మిల అన్నారు. ఆస్తులు సునీత పిల్లలకే చెందేలా వివేకా ఎప్పుడో వీలునామా రాశారని చెప్పారు. వివేకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని మండిపడ్డారు. షర్మిల వ్యాఖ్యలు గమనిస్తే.. వివేకా హత్యలో సునీత ప్రమేయం లేదని షర్మిల క్లీన్చీట్ ఇచ్చినట్టే అనిపిస్తోంది. పరోక్షంగా ఎంపీ అవినాష్రెడ్డి లేవనెత్తిన అంశాలన్నీ తప్పే అన్నట్టుగా ఉన్నాయి ఆమె కామెంట్లు.
వివేకా తన ఆస్తిని రెండో భార్య పేరు మీద రాయాలని భావించారని.. ఆ మేరకు పత్రాలు కూడా రెడీ చేసుకున్నారని.. హత్య తర్వాత ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు మిస్ అయ్యాయనేది అవినాష్రెడ్డి స్టేట్మెంట్. అయితే, షర్మిల మాత్రం వివేకా ఆస్తులు ఎప్పుడో సునీత పేరు మీదకు బదలాయించారని చెబుతున్నారు. ఇక, వివేకా రెండోపెళ్లి గురించి అవినాష్ తరుచూ ప్రస్తావిస్తుండటంతో.. వివేకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు అవినాష్ గురుంచే అంటున్నారు.
అటు, ఒక కన్ను మరో కన్నును పొడుస్తుందా.. అంటూ జగనన్న మాత్రం బాబాయ్ కొడుకు అవినాష్రెడ్డికి మద్దతుగా నిలుస్తుంటే.. చెల్లి షర్మిల మాత్రం అవినాష్కు యాంటీగా, సునీతకు సపోర్ట్గా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ ఫ్యామిలీలో వార్ జోరుగా సాగుతోందని తెలుస్తోంది.