MMTS Hyderabad : రియల్ ఎస్టేట్ ఊరికనే పెరగదు. దానికి తగ్గ మౌలిక సదుపాయాలు ఉండాలి. సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే.. గంట గంటన్నరలో సిటీకి చేరుకోగలిగితే చాలు… 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఇళ్లు కొంటారు. ఇప్పుడు అలాంటి కొత్త అవకాశాలు సృష్టిస్తోంది ఎంఎంటీఎస్ ఫేజ్-2.
ఓవైపు మెట్రో, మరోవైపు ఎంఎంటీఎస్. ఇక ఎప్పుడూ అందుబాటులో ఉండే బస్సులు. హైదరాబాద్లో జర్నీని మరింత ఈజీ చేస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్టేషన్స్. ఎంఎంటీఎస్ ఫేజ్-2 రావడంతో ప్రస్తుతం మేడ్చల్ వైపు ఫోకస్ పెరిగింది. ఇవాళ్టి వరకు రియల్ ఎస్టేట్కు డిమాండ్ ఎక్కువగా ఉన్నది వెస్ట్ హైదరాబాదే. అలాగని మిగతా ఏరియాలకు డిమాండ్ లేదని కాదు. ఇప్పుడు ఎంఎంటీఎస్ ఫేజ్-2 కారణంగా నార్త్ హైదరాబాద్ రేంజే మారిపోబోతోంది.
గతంలో మేడ్చల్కు వచ్చి వెళ్లాలంటే అమ్మో అంత దూరమా అనే వాళ్లు. ఇప్పుడు ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్- సికింద్రాబాద్ మధ్య 20 ఎంఎంటీఎస్ సర్వీసులు తిరగుతుండడంతో ఆ ప్రాంత ప్రజలకు ఊరట దొరికింది. దీంతో మేడ్చల్ వైపు ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారు మరో ఆలోచన లేకుండా కొనేస్తున్నారు. త్వరలో మౌలాలి – సనత్నగర్ మధ్య ప్రత్యేక లైనుతో ఐటీ సెక్టార్కు మరింత దగ్గర మార్గం ఏర్పడుతోంది.
ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఈస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు కూడా ఊతం ఇస్తోంది. సికింద్రాబాద్, లాలాగూడ, మల్కాజిగిరి, దయానందనగర్, సఫిల్గూడ, ఆర్కేపురం, అమ్ముగూడ, కేవర్లీ బ్యారక్స్, అల్వాల్, బొల్లారం, గుండ్ల పోచంపల్లి, గౌడవల్లి, మేడ్చల్ వరకు 28 కిలోమీటర్ల సరౌండింగ్స్ ఎంఎంటీఎస్ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఈ ఏరియాల్లో ఇళ్లు కొనొచ్చు.
ఇక సౌత్ హైదరాబాద్ వైపు కూడా ఎంఎంటీఎస్ ఫేజ్-2 సేవలు అందిస్తున్నాయి. ఫలక్నుమా, శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్లో 20 ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో శంషాబాద్ పరిసరాల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయాలకనుకునే వారికి కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఎంఎంటీఎస్ అందుబాటులోకి వచ్చింది. కొంపల్లి, అల్వాల్, లోతుకుంట, సైనిక్పురి ప్రాంతాల వాళ్లకు కూడా ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సో, ఈ ఏరియాలు ట్రై చేయొచ్చు.