పరమాత్ముడు ఎవరి పాపాలను గాని, ఎవరి పుణ్యాలను గాని స్వీకరించడు. ఎవరి పాప పుణ్యఫలాలను వారే అనుభవించాలి. మన కష్టాలకు ,మన అజ్ఞానానికి, మన కర్తవ్యలోపానికి, దేవుడికి భాగస్వామ్యం కల్పించి ముడుపులు కట్టి దండాలు పెట్టి కాళ్లు మడిచి కూర్చుంటే కష్టాలు తీరవు. కోరికలు నెరవేరవు. ముడుపులు కడితే తాత్కాలిక మనశ్శాంతి మాత్రమే లభిస్తుందేమో కానీ కష్టాలు ఎన్నటికీ తీరవు.
పుణ్యక్షేత్రాలకు వెళ్లి తల వెంట్రుకలు సమర్పించటంలో అంతరార్థం చాలా మందికి తెలియదు. కుటుంబ నిర్వహణ కోసం , సంసార బాధ్యతా, విధిని నిర్వర్తించటం కోసం అబద్ధాలు, మోసాలు చేయాల్సిన అవసరం వల్ల పాపాలు కలుగుతాయి. ఆ పాపాలన్నీ తల వెంట్రుకల్లో దాగి ఉంటాయని ప్రాచీనంగా వస్తున్న నమ్మకం. పాపాలు పోగట్టుకోవడానికే తలవెంట్రుకలు దేవునికి సమర్పించాలని శాస్తం చెబుతోంది.
గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాలను ఈ జన్మలో అనుభవించి తీరాలన్నది సనాతన ధర్మం చెబుతోంది. అందువల్ల ముడుపులు, మొక్కలు వల్ల ఫలితం ఉండదు. దేవుడి ఎవరికీ కావాలని కష్టాలు కల్పించడు. దేవునికి అందరూ బిడ్డలే. దేవుడు దయా స్వరూపుడు. తన బిడ్డలకు తల్లిదండ్రులు అపకారం చేయరు కదా. తాను సృష్టించిన బిడ్డలకు దేవుడు కూడా అపకారం చేయడు. కాబట్టి మొక్కలు తీర్చినా..తీర్చకపోయినా దేవుడికి సంతోషం కలగదు . మన అనుమానాలు అర్ధం లేనివి.
కానీ ఒక మొక్కు అనుకున్న తర్వాత వదిలేస్తే తర్వాత ఏ పనిలో వ్యతిరేక ఫలితం వచ్చినా మనకు నెగిటివ్ ఫీలింగ్ పెరిగిపోతుంది. కాబట్టి అలాంటి భావన మనలో పెరగకూడదంటే.. పాజిటివ్ గా ఉండాలి. దేవుడి కోసం కాకపోయినా..మన ఆత్మసంతృప్తి కోసమైనా మొక్కులు పాటించవచ్చు.