Ola Electric Scooter : ఓలా స్కూటర్ బుక్ చేశారా? వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉందా? కొన్నాళ్లు ఎదురుచూపులు తప్పకపోయినా… వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించేందుకు ఓలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఉత్పత్తి పెంచబోతున్నామని… భవిష్యత్ లో డిమాండ్లు తీర్చే స్థాయిలో… తమిళనాడు కృష్ణగిరిలోని తమ కర్మాగారం సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని… కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీష్ అగర్వాల్ చెప్పారు. అంతేకాదు… వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ బైక్ లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించాడు. వాటి వివరాలను వెల్లడించడానికి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని… త్వరలోనే అందరితో పంచుకుంటానని చెప్పుకొచ్చాడు.
2021 ఆగస్ట్ లో మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయించామని ఓలా చెబుతోంది. ప్రస్తుతం రోజూ వెయ్యికిపైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నామని… ఈ సంఖ్యను ఇంకా పెంచుతామని అంటోంది. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటామని వెల్లడించింది. అంటే… ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తుందన్న మాట. ఈ లక్ష్యాన్ని చేరుకున్నాక… ఏడాదికి కోటి యూనిట్లను ఉత్పత్తి చేసేలా ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్తామని ఓలా అంటోంది. అదే జరిగితే… బైక్ కావాలని కస్టమర్ అడిగిన వెంటనే… స్పాట్ డెలివరీ చేసే రేంజ్ కు చేరుకుంటుంది… ఓలా.
ప్రస్తుతం S1, S1ప్రో మోడళ్లను విక్రయిస్తున్న ఓలా… రీసెంట్ గా S1 Air మోడల్ ను లాంచ్ చేసింది. రూ.79,999కి ఆ స్కూటర్ ను బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 24 వరకు ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాత అదే బైక్ ధర రూ.84,999కి పెరుగుతుందని ఓలా ప్రకటించింది. S1 Airను బుక్ చేసుకున్న వారికి… వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి డెలీవరీలు ప్రారంభిస్తామని ఓలా ప్రకటించింది.