Jagan: ఉత్తరాంధ్రపై జగన్ స్పెషల్గా ఫోకస్ చేశారా..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నారా..? వైనాట్ 175 సాధిస్తామని గట్టిగా నమ్ముతున్నారా..? అందుకే విశాఖలో కాపురం పెడతానంటూ చేసిన వాఖ్యలు అందుకు సంకేతమా..? ఇంతకీ జగన్ గేమ్ ఛేంజ్ చేయడానికి కారణమేంటి..?
మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలనూ టీడీపీ గెలుచుకోవడం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేసి హ్యాండ్ ఇవ్వడంతో.. వచ్చే ఎన్నికల కోసం జగన్ సరికొత్త ప్లాన్స్తో ముందుకెళ్లబోతున్నారు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం అంటూ ఎగ్జిక్యూటివ్ కేపిటల్పై క్రిస్టల్ క్లియర్గా చెప్పేసిన జగన్.. తన పొలిటికల్ గేమ్ ప్లాన్ మార్చినట్టు కనిపిస్తోంది.
ఇక సీట్ల పంపకాల విషయంలో కూడా క్లారిటీగా ఉన్న జగన్.. ఏ ఒక్కర్నీ వదులుకోనని, టికెట్ల భయం అక్కర్లేదంటూ ఇప్పటికే స్పష్టంగా చెప్పేశారు. ఇకపోతే వచ్చే ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు కూడా రూపొందించారు. ఇందులో భాగంగానే జిల్లాల పర్యటనలు స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో తనతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో బహిరంగ సభలు పెట్టడంతోపాటు.. ప్రజలతో మాటామంతీ నిర్వహించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఎన్నికల వరకు వైసీపీ నేతలు ఎక్కడా రిలాక్స్ అవకుండా.. యాక్టివ్గా ఉంటే.. 175 సీట్లకు 175 సీట్లు సాధ్యమవుతాయని బలంగా నమ్ముతున్నారాయన. ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
వై నాట్ 175.. ఇది మొన్నటివరకు జగన్ బలంగా వినిపించిన మాట. బటన్ నొక్కుతున్నా.. తన పని తాను చేస్తున్నా.. 2 లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో వేశామని.. ప్రతి పల్లెలో.. ప్రతి ఇంట్లో.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారని ఆయన కేడర్కు చెప్పేవారు. వాళ్లందరి ఓట్లు తమకే అంటూ.. వై నాట్ 175 అంటూ కుండబద్దలు కొట్టి చెప్పేవారు జగన్. కానీ.. రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ను.. వైసీపీ నాయకుల్ని.. కేడర్ని డైలమాలో పడేశాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ పరాజయం.. రెబల్ ఎమ్మెల్యేల తలనొప్పితో.. ఎక్కడో ఏదో తేడా కొడుతోందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో.. రూట్ మార్చారు జగన్. నేతలకు, ఎమ్మెల్యేలకు వేరే ఆలోచనలు రాకుండా.. ప్రతీరోజూ ఏదో ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఎమ్మెల్యేలు బిజీగా ఉండడంతోపాటు.. జనంతో మమేకమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే జనంలో ఎక్కువగా తిరిగే కార్యక్రమాలకే రూపకల్పన చేస్తున్నారు. స్వయంగా తానే రంగంలోకి దిగి నేతల్లో జోష్ నింపాలనే ఆలోచనలో ఉన్నారు జగన్.