RCB VS PBKS:- మొహాలీలో పంజాబ్, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు గెలిచింది. ఓడిపోయినప్పటికీ.. పంజాబ్ బ్యాటర్లు పోరాట పటిమ చూపించారు. పంజాబ్ది నిజంగా అద్భుతమైన బ్యాటింగ్. 6 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయి 50 పరుగులు కూడా చేయని జట్టు 150 పరుగుల వరకు వెళ్తుందని ఎవరైనా అనుకుంటారా. కాని, పంజాబ్ గేమ్ను ఛేంజ్ చేసే ప్రయత్నం చేసింది. ఆ క్రెడిట్ మొత్తం వికెట్ కీపర్ జితేశ్ శర్మదే. ఆ తరువాత చెప్పుకోవాల్సంది ప్రభ్సిమ్రాన్ సింగ్. ఈ ఇద్దరు వికెట్లు పడుతున్నా బ్యాటింగ్లో దూకుడు మాత్రం తగ్గించలేదు. ఏదైతే అదైంది చూసుకుందాం అన్న రీతిలో సాగింది పంజాబ్ బ్యాటింగ్. జిడ్డు బ్యాటింగ్ అనే ముచ్చటే లేదు. కొట్టగలిగితే కొట్టడం లేదంటే ఔట్ అవడం. ఇదే కనిపించింది పంజాబ్ బ్యాటింగ్లో.
టాస్ గెలిచిన పంజాబ్.. బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించింది. చాలాకాలం తరువాత కెప్టెన్గా ఆడుతున్న విరాట్ కొహ్లీ, మరో ఓపెనర్ డుప్లెసిస్ పంజాబ్ బౌలర్లను చితకొట్టారు. 16 ఓవర్ల వరకు క్రీజులో నిలబడి జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 59 పరుగులు, డుప్లెసిస్ 56 బంతుల్లో 84 పరుగులు చేశారు. అయితే, ఓపెనర్లు మినహా ఎవరూ క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
మ్యాక్స్ వెల్ గోల్డెన్ డక్ అయ్యాడు. దినేష్ కార్తిక్ కూడా సింగిల్ డిజిట్కే ఔట్ అయ్యాడు. మహిపాల్ రామ్ రోర్, షబాజ్ అహ్మద్ కూడా లాస్ట్ ఓవర్స్ లో ఆడలేకపోయారు. ఇక పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ కు రెండు వికెట్లు, అర్ష్ దీప్ సింగ్, నాథమ్ నిల్ చెరో వికెట్ తీసుకున్నారు.
175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ ఆటగాళ్లు.. మొదట్లోనే తేలిపోయారు. పవర్ ప్లేలో ఆర్సీబీ బౌలర్లు చెలరేగారు. ఓపెనర్ అథర్వ తైడే, లివింగ్స్టోన్ను మహ్మద్ సిరాజ్ ఎల్బీగా ఔట్ చేశాడు. హసరంగ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ బౌల్డ్ అయ్యాడు. విజయ్కుమార్ బౌలింగ్లో హర్ప్రీత్ సింగ్ భాటియా రనౌట్ అయ్యాడు. ఇలా వరుసగా వికెట్లు పడడంతో.. పంజాబ్ 6 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. కాని ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్గా వచ్చిన ప్రభ్సిమ్రాన్ సింగ్ మాత్రం షాట్లు కొడుతూ నేనున్నాననే హెచ్చరికలు పంపించాడు. ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. 4 సిక్సులు, 3 ఫోర్లతో 30 బాల్స్కు 46 పరుగులు చేశాడు. ఇక ఆ తరువాత చెప్పుకోవాల్సింది జితేశ్ శర్మ గురించే. ఒక్కొక్కరుగా ఔట్ అవుతున్నా సరే.. బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. వర్షం వచ్చేలా కనిపించడంతో దూకుడుగా ఆడాడు. అదే ప్రయత్నంలో ఆల్ ఔట్ అయ్యారు.
బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, హసరంగ 2 వికెట్లు, పార్నెల్, హర్ష పటేల్ చెరో వికెట్ తీశారు.