Indian Army: ఆర్మీ జవాన్లు. జమ్ముకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. విధి నిర్వహణలో భాగంగా వారంతో ఆర్మీ ట్రక్కులో వెళ్తున్నారు. అంతలోనే ఏదో పిడుగుపడిన ఫీలింగ్.
సడెన్గా ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు విజృంభించాయి. ప్రమాదంలో ఐదుగురు జవాన్లు సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు.
మొదట ఇది ప్రమాదం కావొచ్చని అనుకున్నారు. ఆ సమయంలో భారీ వర్షం పడుతోంది. అందుకే, పిడుగు పడిందేమోనని సందేహించారు. అసలే పూంచ్ సెక్టార్ కావడంతో ఎందుకైనా మంచిదని విచారణకు ఆదేశించింది ఆర్మీ. ఉగ్ర కోణం ఉందేమోనని ఆరా తీసింది.
ఆర్మీ అధికారుల అనుమానమే నిజమైంది. వర్షం మాటున ఉగ్రవాదులు నక్కారు. ఆర్మీ వాహనంపై గ్రెనేడ్లు విసిరారు. గ్రెనేడ్ దాడికి ట్రక్కు కాలిపోయింది. అందులోని జవాన్లు సజీవ దహనం కావడం కలకలం రేపుతోంది.
వెంటనే అప్రమత్తమైన ఆర్మీ.. ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టింది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. పూంచ్, జమ్మూ రీజియన్లో హైఅలర్ట్ ప్రకటించారు.