Chota News: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోస్గిలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో ముస్లింలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీలకు రంజాన్ కానుకను అందజేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి స్వగ్రామం నారావారిపల్లెలో చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చంద్రగిరిలోని టవర్ క్లాక్ వద్ద నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పులివర్తి నాని పాల్గొన్నారు. 2024లో చంద్రబాబును సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల సెల్ఫీ ఛాలెంజ్లు కొనసాగుతున్నాయి. టీడీపీ హయాంలో 6వేల టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తి అయ్యాయని.. వైసీపీ వచ్చి నాలుగేళ్లయినా 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా మక్తల్లో తహసిల్దార్ కార్యాలయం ముందు సీపీఐఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సంచార జాతుల వారికి, బుడగ జంగాల వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు లేదా.. స్థలం ఉన్న వారికి 3 లక్షలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి పోలీసులు భద్రతను పెంచారు. వైసీపీ ఎంపీ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో.. దస్తగిరికి ఇప్పటి వరకు ఉన్న వన్ ప్లస్ టు భద్రతను వన్ ప్లస్ 5కి పెంచారు.
ఖలిస్తాన్ అనుకూల నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ భార్య కిరణ్దీప్ కౌర్ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు అమృత్సర్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కిరణ్ దీప్కౌర్.. లండన్ విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.
సత్యసాయిజిల్లా పెనుకొండకు కియా కార్ల పరిశ్రమను తెచ్చిన ఘనత చంద్రబాబుదని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి అన్నారు. జిల్లాకు ఇంకా 14 పరిశ్రమలు రావాల్సి ఉండగా.. జే టాక్స్కు భయపడి వెనక్కి వెళ్లాయని ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసులో జగన్, ఆయన సతీమణి పేర్లు బయటకు రాక తప్పదని జోస్యం చెప్పారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి భూకబ్జా వివాదం కొత్త మలుపు తిరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అనుచరులపై బాధితులు చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రికి రాత్రే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ సహా రెండు గుళ్లకు తాళాలు వేసి.. ప్రైవేట్ వ్యక్తులను కాపలా పెట్టారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు.
మహిళ కడుపులో కర్చీఫ్ మర్చిపోయిన కేసుపై జగిత్యాల ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రాములు స్పందించారు. బాధితురాలు నవ్యశ్రీ మూడో కాన్పు కోసం తమ ఆస్పత్రికి వచ్చిందని.. ఆమెకు గతంలో రెండు కాన్పులు జరిగాయని.. ఆ కాన్పుల్లో కర్చీఫ్ మర్చిపోయి ఉండొచ్చని నిర్లక్ష్య సమాధానం చెప్పారు. దీంతో న్యాయం కోసం నవ్యశ్రీ కుటుంబసభ్యులు కలెక్టర్ను ఆశ్రయించారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని దోచుకుని కోటీశ్వరుడు అయ్యాడని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. 2004లో కోటి రూపాయలు ఉన్న ఆస్తి.. ఇవాళ 510 కోట్లకు ఎలా చేరిందని నిలదీశారు. పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడని.. జగన్ మాత్రం దోచుకుంటున్నాడని విమర్శించారు.
నిజమాబాద్ జిల్లా మంచిప్పలో విద్యుత్ బిల్లు కలకలం సృష్టించింది. పెంకుటిల్లుకు దాదాపు రూ. 54 వేల బిల్లు రావడంతో బాధితులు అవాక్కయ్యారు. ప్రతి నెలా సక్రమంగా బిల్లు చెల్లిస్తున్నా.. మార్చి నెల బిల్లు షాకిచ్చింది. బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో సచివాలయం మూతపడింది. తాను నిర్మించిన భవనానికి బిల్లులు మంజూరు కాలేందంటూ కాంట్రాక్టర్ తాళాలు వేశారు. రూ. 33 లక్షల బిల్లులు పెడితే.. 25 లక్షలే ఇచ్చారని.. మిగత 8 లక్షలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే తాళాలు వేసినట్లు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దారుణం చోటుచేసకుంది. హైస్కూల్లో ఎగ్జామ్ జరుగుతుండగా విద్యార్థులు కత్తులతో పొడుచుకున్నారు. ఓ విద్యార్థి… ఇద్దరు విద్యార్థులను కత్తితో పొడిచాడు. గాయపడ్డ విద్యార్థులను టీచర్లు ఆస్పత్రికి తరలించారు. టీచర్ల ముందే ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు దీర్ఘాయుష్షుతో ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. విజయసాయి ట్వీట్ చూసి.. మీరు మారిపోయారు సార్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రముఖ మొబైల్ కంపెనీ యాపిల్ ఇండియాలో తన రెండో రిటైల్ స్టోర్ను ప్రారంభించింది. ఢిల్లీలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్లో కంపెనీ సీఈవో టిమ్ కుక్ యాపిల్ స్టోర్ను ప్రారంభించారు. రెండు రోజుల క్రితం ముంబైలో యాపిల్ తొలి స్టోర్ అందుబాటులోకి వచ్చింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువునష్టం కేసులో మెట్రోపాలిటన్ కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇవ్వాలంటూ రాహుల్ వేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టేసింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు.. ఎంపీ పదవికి అనర్హత వేటు పడింది.
ఎంసెట్లో ఇంటర్ మార్కుల వేయిటేజీని తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసింది. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులను కేటాయించనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. పీఎస్ఎల్వీ సీ55 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించే ఈ రాకెట్ ద్వారా సింగపూర్కు చెందిన ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు.
బుద్ధుడి బోధనల ప్రచారానికి భారత్ అకింతభావంతో పనిచేసిందని ప్రధాని మోదీ అన్నారు. దేశం వివిధ రంగాల్లో ప్రపంచ మైలురాళ్లను సాధించడం వెనుక బుద్ధ భగవానుడి స్ఫూర్తి ఉందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ బౌద్ధ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. 19 మంది సన్యాసులకు వస్త్రాలను అందజేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో జంపింగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. అధికార బీజేపీలో టికెట్ రాని నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మాజీ సీఎంలు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరగా.. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.