BRS Party News Telangana: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి భూకబ్జా వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి వంద కోట్ల విలువైన భూమి కబ్జా చేశారని బాధితుడు బీఆర్ఎస్ నేత సామా దామోదర్ రెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే మనుషులు చంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిల్ రెడ్డి సహా పలువురు తమను ట్రక్కులతో తొక్కి చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు.
ఈర్లపెల్లి గ్రామం సర్వే నెంబర్ 35, 36లో సుమారు 65 ఎకరాలు భూమి ఉంది. ఈ స్థలంలో సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, ఫంక్షన్ హాల్తో పాటు కొంత ఖాళీ స్థలం ఉంది. వీటిపై కన్నేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులను రంగంలోకి దింపి కబ్జా పెట్టాడని బాధితులు ఆరోపించారు. ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించి.. ఆలయాలకు తాళం వేయించి దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన రైతు సంఘం నేత అని కూడా చూడకుండా తనను బెదిరించాడని దామోదర్రెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే రాత్రికి రాత్రి స్థలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ సహా రెండు ఆలయాలకు తాళం వేసి ప్రైవేట్ వ్యక్తులను కాపలా పెట్టారు. విషయం తెలుసుకున్న బాధితులు కబ్జాకు గురైన స్థలంలో ఆందోళనకు దిగారు.
ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దృష్టికి తీసుకెళ్లామని బాధితులు చెప్పారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.