Vijayasai Reddy(AP Political Updates) : “టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా”. ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో చంద్రబాబు పేరు చెబితే చాలు విజయసాయిరెడ్డి ఒంటికాలిపై లేచేవారు. మీడియాలో రాయలేని భాషలో తిట్టేవారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన విమర్శల బైట్లను టీవీ ఛానళ్లు బీప్ సౌండ్ తో ప్లే చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం ఘాటైన విమర్శలు చేస్తూ చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శలు చేసేవారు విజయసాయి. చంద్రబాబుపై ఆయన చేసే ట్వీట్లు కూడా అంతే ఘాటుగా ఉండేవి.
2021 ఏప్రిల్ 20న విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ అంటూ మరో ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.”ఏపీలో ఆఫీసులు మూసేయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టినరోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్లే పుట్టినరోజు ఘనంగా చెయ్యద్దంటూ సందేశం. 17 తర్వాత పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్లీ నీ బ్రీఫ్ డు అవసరంలేదు”. ఈ ట్వీట్ 2021లో విజయసాయిరెడ్డి చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతం గతమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత మిత్రులు ఉండరు. చంద్రబాబు విషయంలో విజయసాయిరెడ్డి వైఖరి మారింది. ఆయనపై ఈ మధ్యకాలంలో ఎలాంటి ట్వీట్లు చేయలేదు. అలాగే మీడియా ముందు చంద్రబాబుపై విమర్శలు గుప్పించలేదు. తారకరత్న మరణం సమయంలో చంద్రబాబు పక్కనే కూర్చుని విజయసాయిరెడ్డి చాలాసేపు మాట్లాడారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్నారు. తారకరత్న భార్య విజయసాయిరెడ్డికి బంధువు. తారకరత్న అంత్యక్రియల దగ్గర నుంచి దశదిన కర్మ వరకు బాలకృష్ణతో కలిసి విజయసాయిరెడ్డి బాధ్యతలు పంచుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు చాలా మర్యాదపూర్వంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు వైసీపీతో విజయసాయిరెడ్డికి దూరం రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. సోషల్ మీడియా విభాగంలో కీలక బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ కు అప్పగించారు. ఆ తర్వాత నుంచి వైసీపీలో అంత యాక్టివ్ గా విజయసాయిరెడ్డి కనిపించడంలేదు. ఇటీవల అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వగానే సీఎం జగన్ పార్టీ ముఖ్యనేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఆ భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. పార్టీ అవిర్భావం నుంచి వైసీపీలో విజయసాయిరెడ్డే నంబర్ 2గా కొనసాగారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో సజ్జల పట్టు సాధించారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయింది.