Corona Virus News(National news Updates) : భారత్ లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 12 వేలు దాటేసింది. దేశంలో తాజాగా 12,591 కొవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. క్రితం రోజు కంటే 20 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. కరోనా కేసుల రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 10,827 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 92.48 కోట్ల కొవిడ్ వైరస్ పరీక్షలు నిర్వహించారు. గత రెండు వారాలుగా కేసులు సంఖ్య పెరగడంతో టెస్టులను పెంచారు. తాజాగా 2,30,419 మంది కొవిడ్ టెస్ట్ చేశారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 కేసులే ఎక్కుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. కేసులు పెరిగినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆస్పత్రిలో చేరికలు మాత్రం తక్కువగానే ఉన్నాయని వివరించింది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. మరోవైపు వచ్చే రెండు వారాల్లో ఢిల్లీలో కొవిడ్ కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. వీలైనంత తొందరగా ప్రజలు వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయించుకోవాలని కేంద్రం సూచించింది. ఇప్పటి వరకు మొదటి, రెండో డోసులు కలిపి 220.66 కోట్ల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
అనేక రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.