Delhi Capitals : గోరుచుట్టు మీద రోకలి పోటు అంటే ఇదే. అసలే బోణీ కొట్టలేదన్న ఫ్రస్టేషన్తో ఉన్న జట్టుకు అడుగడుగునా టెన్షన్ పెట్టే సంఘటనలే జరుగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు సంబంధించిన విలువైన క్రికెట్ కిట్లను దొంగిలించేశారు.
ఐపీఎల్ ఆటగాళ్లకు ప్రొవైడ్ చేసే బ్యాట్లు, ప్యాడ్లు చాలా కాస్ట్లీ. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి.. వాటి విలువ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయం బాగా గమనించినట్టు ఉన్నారు. సమయం చూసి.. కొట్టేశారు. పైగా ఫ్రస్ట్రేషన్తో పాటు డిప్రెషన్లో ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు. బహుశా ఇది గమనించే చేతివాటం చూపించినట్టున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ చెప్పే దాని ప్రకారం వీటి విలువ లక్షల్లో ఉంటుంది తెలుస్తోంది.
మొన్న బెంగళూరుతో మ్యాచ్ తరువాత ఆటగాళ్లందరూ ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఒకరోజు తరువాత వారి లగేజీ హోటల్ రూమ్కి వచ్చింది. వాటిని తెరిచి చూడగా దాదాపు అందరి ఆటగాళ్ల బ్యాట్లు, ప్యాడ్లు, ఇతర క్రికెట్ ఎక్విప్మెంట్ మిస్ అయినట్లు గుర్తించారు. బ్యాటర్ యశ్ ధుల్కు చెందిన ఐదు బ్యాట్లు పోయినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల కిట్లు ఎక్కడ మిస్ అయ్యాయని ఎయిర్ పోర్ట్ లాజిస్టిక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలే ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడం.. ఇప్పుడు ఆటగాళ్ల బ్యాట్లు, ప్యాడ్లు దొంగిలించడంతో ఈ వార్త నెట్టింట్లో వైరల్గా మారింది.