IPL: ఐపీఎల్ 2023 ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అయితే ఐపీఎల్ సీజన్ నడుస్తోంది అంటే బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదాలు బాగా వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఈ ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాడు. ఎవరో ఒక వ్యక్తి తనని మ్యాచ్ ఫిక్సింగ్ వ్వహారంలో సంప్రదించినట్లు.. సిరాజ్ బీసీసీఐ యాంటీ కరప్షన్ వింగ్ దృష్టికి తీసుకెళ్లాడు. రంగంలోకి దిగిన బీసీసీఐ అసలు విషయాన్ని నిగ్గు తేల్చారు. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సీజన్లో సిరాజ్ అనూహ్యమైన గణాంకాలను నమోదు చేస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో జట్టులో కీలక బౌలర్గా మారుతున్నాడు. ఇప్పుడు సిరాజ్ పర్ఫార్మెన్స్ పరంగా కాకుండా మరో విషయంలో వైరల్ అవుతున్నాడు. సిరాజ్ ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాన్ని సంప్రదించాడు. గుర్తుతెలియని వ్యక్తి తనని మ్యాచ్లకు సంబంధించి సంప్రదించినట్లు వెల్లడించాడు. సిరాజ్ కి బెట్టింగ్, డబ్బు విషయంలో వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు.
ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన బీసీసీఐ యాంటీ కరప్షన్ వింగ్ సదరు వ్యక్తిని గుర్తించింది. అతను హైదరాబాద్కు చెందిన ఆటో డ్రైవర్గా గుర్తించారు. ఆ వ్యక్తి బెట్టింగ్లో భారీగా డబ్బు కోల్పోయినట్లు తెలిపారు. ఇదే విషయంపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందించారు. సిరాజ్ని సంప్రదించింది బుకీ కాదని.. అతను క్రికెట్ బెట్టింగ్కి బానిసై పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయాడన్నారు. ఆర్సీబీ అంతర్గత సమాచారం కోసం సిరాజ్ని సంప్రదించాడు. సిరాజ్ తమకు ఆ విషయాన్ని తెలపడంతో.. లా ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారంటూ బీసీసీఐకి చెందిన అధికారి వెల్లడించారు.
మహ్మద్ సిరాజ్ చేసిన ఈ పనిని కచ్చితంగా అభినందించాల్సిందే అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మహ్మద్ సిరాజ్ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాడంటూ ప్రశంసిస్తున్నారు.