India: దేశంలో ఏదైనా ఓ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పాలంటే.. ఆ రాష్ట్రంలోని వివిధ అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు అనేది కూడా ఓ ముఖ్యమైన పారామీటర్గా చెప్పవచ్చు. మరి భారత్ లో ఆనందకరమైన రాష్ట్రం ఏదో తెలుసా…? ఇప్పుడు ఓ స్టడీ ఈ విషయంపై ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది.
దేశంలో అత్యంత ఆనందకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. గురుగ్రామ్లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ రాజేశ్ పిల్లానియా నిర్వహిచిన ఓ సర్వే ఈ విషయాన్ని స్పష్టంచేసింది. భారత్ లో 100శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రం మిజోరం. అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్ని అధిగమిస్తూ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రంగా తేలింది.
ప్రొఫెసర్ రాజేశ్ పిల్లానియా నిర్వహించిన సర్వేలో ఆరు పారామీటర్స్ పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో కుటుంబ సంబంధాలు, పని సంబంధిత విషయాలు, సామాజిక అంశాలు, సేవాదృక్పథం, మతం, కొవిడ్ ప్రభావాలు… ప్రజల భౌతిక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించాయని సర్వేలో వివరాలు సేకరించారు. సేకరించిన డేటాను విశ్లేషించి దేశంలో మిజోరంను అత్యంత ఆనందకరమైన రాష్ట్రంగా నిర్ధరించారు.
సర్వేలో సేకరించిన కొన్ని కేస్ స్టడీస్ను ప్రొఫెసర్ రాజేశ్ పిల్లాయని ప్రత్యేకంగా వెల్లడించారు. ఇందులో భాగంగా కొందరు స్టూడెంట్స్ భవిష్యత్పై ఎలాంటి దృక్పథంతో ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించారు. ఐజ్వాల్లోని గవర్నమెంట్ మిజో హైస్కూల్ విద్యార్థి అనుభవాన్ని పేర్కొన్నారు. తాను చిన్నతనంలో ఉన్నప్పుడే తన తండ్రి కుటుంబాన్ని వదిలివెళ్లారని, అయినా ఆశావాద దృక్పథంతో జీవిస్తున్నట్టు సదరు విద్యార్థి అన్నాడు. అంతే కాకుండా భవిష్యత్పై నమ్మకంంతో చార్టెడ్ అకౌంటెంట్ లేదా సివిల్ సర్వెంట్ కావాలనే లక్ష్యంతో చదువుపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ విషయాన్ని సర్వేలో పొందుపరిచారు.
అదేవిధంగా గవర్నమెంట్ మిజో హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కావాలనే ఆశయంతో ఉన్నట్టు సర్వేలో మరో కేస్ స్టడీని వెల్లడించారు. ఆ విద్యార్థి తండ్రి పాల ఉత్పత్తి కేంద్రంలో పని చేస్తుండగా… తల్లి గృహిణిగా ఉన్నారు. అలాగే స్కూల్లో టీచర్లు తమకు బెస్ట్ ఫ్రెండ్స్ అని, వారితో ఏ విషయాన్నైనా నిర్భయంగా షేర్ చేసుకుంటామని విద్యార్థి తెలిపాడు. మరోవైపు… గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న తమ కుమారుడు తప్పకుండా సక్సెస్ అవుతాడని తల్లిదండ్రులు కూడా విశ్వాసంతో ఉన్నారు.
మిజోరంలోని సామాజిక స్థితిగతులు కూడా యువత ఆనందకరమైన జీవనానికి దోహదబడుతున్నాయి. కులరహిత సమాజంలో తాము జీవిస్తున్నామని యువత చెబుతున్నారు. విద్యార్థులపై చదువు పేరుతో ఒత్తిడి చేయకుండా బోధిస్తామని ప్రైవేటు టీచర్లు కూడా అంటున్నారు. యువత కూడా త్వరగానే ఉపాధి రంగంలో స్థిరపడి, సంపాదనాపరులు అవుతున్నారని సర్వేలో స్పష్టంచేశారు.