Apple Store launch in Mumbai :యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఫుల్ ఖుష్. ఇండియాలో ఆతిథ్యం చూసి పొంగిపోయాడు. తమ యాపిల్ కంపెనీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం రావడంతో పాటు.. ఇండియాలో వచ్చే రెండేళ్లలో తమ సంస్థ లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.
ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్ ఓపెన్ అయింది. ఈ స్టోర్ను యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రారంభించారు. లాస్ఎంజెల్స్, న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్పూర్ తర్వాత ముంబైలో ఏర్పాటు చేసిన యాపిల్ ఐ-ఫోన్ రిటైల్ స్టోర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టిమ్ కుక్ను చూసేందుకు, యాపిల్ ప్రొడక్ట్లను కొనుగోలు చేసేందుకు భారత్తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన యాపిల్ అభిమానులు స్టోర్ ఎదుట బారులు తీరారు. చాలా మంది సందర్శకులు స్టీవ్ జాబ్స్ ఇష్టపడేలా టీ-షర్టులను వేసుకుని వచ్చారు. జుట్టును యాపిల్ లోగో ఆకారంలో కత్తిరించుకొని అభిమానాన్ని చాటుకున్నారు. ఓ అభిమాని ఏకంగా 1984లో ప్రారంభించిన మొదటి యాపిల్ కంప్యూటర్ మాకింతోష్ కంప్యూటర్ తీసుకొచ్చాడు. ఇవన్నీ చూసిన టిమ్ కుక్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
మాధురి దీక్షిత్తో కలిసి వడా పావ్ లాగించాడు. ఆకాశ్ అంబానీని స్పెషల్గా మీట్ అయ్యారు. ఇదే సమయంలో భారత్లోని వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు టిమ్ కుక్ను కలిశారు. 20వ తేదీ వరకు టిమ్ కుక్ ఇండియాలోనే ఉండబోతున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్ లాంఛ్ చేయనున్నారు.
మొత్తానికి యాపిల్ సీఈవో టిమ్ కుక్.. ఇండియా టూర్లో ఫుల్ బిజీగా, చాలా హ్యాపీగా గడుపుతున్నారు.