Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఐదోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయన కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. సీబీఐ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఆయన్ను ఈనెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది.
అయితే అప్పటి వరకు సీబీఐ కార్యాలయంలో ప్రతి రోజూ విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి షరతు విధించింది. అవినాష్కు ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు వివేకా హత్య కేసులో అరెస్టైన నిందితులు వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిలను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలులో ఉన్న నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. అక్కడ వారిద్దర్నీ ప్రశ్నిస్తున్నారు.
భాస్కరరెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిలను 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ న్యాయస్థానంలో మంగళవారం విచారణ జరిగింది. వారిని ఈ నెల 19 నుంచి 24 వరకు 6రోజులపాటు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కోసం చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలతో కలిపి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఈ నెల 25న అవినాష్ రెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.