Corona :కొత్త వేరియంట్ కారణంగా దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే వేల మంది కొవిడ్ బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 10 వేల 542 మందికి వైరస్ సోకింది. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 63 వేల 562కు చేరుకుంది.
కొవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్ర అప్రమత్తమైంది. వైరస్ కేసుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాలు టెస్ట్ ల సంఖ్య పెంచడంతోపాటు టీకాలు వేసే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించేలా చర్యలు తీసుకుంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేపట్టింది. గత రెండు డోసులు కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఇవ్వగా… బూస్టర్ డోసుగా కొత్తగా కార్బీవ్యాక్స్ ఇస్తున్నారు. 5 లక్షల వ్యాక్సిన్ డోస్లు అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
కొవిడ్ వ్యాక్సిన్ల కొరతతో కొంతకాలంగా బూస్టర్ డోసుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్రాలే సొంతంగా కొవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో.. తెలంగాణ సర్కార్ హైదరాబాద్కి చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఈ నుంచి 5 లక్షల కార్బీవ్యాక్స్ డోసులను కొనుగోలు చేసింది.
మరోవైపు కొవిడ్ కేసులు పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు.