Chandrababu: వివేక హత్య కేసు ఎంపీ అవినాస్రెడ్డి అరెస్ట్ వరకూ వచ్చింది. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కాస్త ఊరట లభించింది. అయినా, ఈ నెల 25 తర్వాత ఏం జరుగుతుందోననే టెన్షన్ కంటిన్యూ అవుతోంది. అవినాష్ తండ్రి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం.. సీబీఐ కస్టడీకి తీసుకోవడం.. రాజకీయంగా కలకలం రేపింది. ఇదంతా సునీత, సీబీఐ, చంద్రబాబు కలిసి చేస్తున్న కుట్ర అంటూ వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అటు, టీడీపీ సైతం ధీటుగా జవాబిస్తోంది.
వివేకా హత్య కేసును ప్రజాకోర్టులో పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ కేసు.. ప్రపంచంలోని పోలీసు అధికారులకు కేస్ స్టడీలాంటిదన్నారు. నిందితులు సీబీఐ అధికారులనూ బెదిరించారని.. గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. ఇలాంటి రౌడీల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు చంద్రబాబు.
వివేకా హత్య కేసులో నిందితులను సీబీఐ అరెస్ట్ చేస్తే.. వైసీపీ నాయకులు నిరసన ర్యాలీలు తీయడం సిగ్గు చేటని చంద్రబాబు ధ్వజమెత్తారు. తండ్రి హత్య కేసులో న్యాయం కోసం ఒక ఆడ బిడ్డ పోరాడుతుంటే అండగా ఉండాల్సింది పోయి వ్యతిరేక ర్యాలీలు తీసారని ఫైర్ అయ్యారు. మానవత్వం ఉన్న పోలీసులు, లాయర్లు, ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి మర్డర్ను ఖండించాలన్నారు.
వారికి అడ్డువచ్చిన వారందర్నీ చంపేస్తారా? రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ను పూర్తిగా అణచివేసింది టీడీపీనేనని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హత్యలు, దౌర్జన్యాలు, బలహీనవర్గాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. కడప సభలో వైసీపీపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.