Munugode : ఉపఎన్నిక సమయంలో మునుగోడు నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ఎన్నో వరాలు ప్రకటించారు. ఈ ప్రాంతంలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మునుగోడులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. కేసీఆర్ హామీలను ప్రజలు విశ్వసించారు. ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. అయితే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు కీలకమైన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఆస్పత్రిని రూ.36 కోట్ల నిధులతో నిర్మించనున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని హరీష్ రావు స్పష్టం చేశారు. అందుకే పల్లె దవాఖానాలను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవన్నారు. కానీ ఇప్పుడు 68 శాతానికి పెరిగాయన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.1300 కోట్లతో వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని హరీష్ రావు తెలిపారు. మర్రిగూడకు 30 పడకల ఆస్పత్రిని మంజూరు చేశామని తెలిపారు. తంగేడిపల్లి పీహెచ్సీకి రూ.90 లక్షలు కేటాయించామని చెప్పారు. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే విద్యార్థులు ఉక్రెయిన్, ఫిలిఫ్పీన్స్ వెళ్లేవారని.. కానీ ఇప్పుడు 35 మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. బీబీనగర్లో ఎయిమ్స్ ను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అక్కడ వసతులు కల్పించలేదన్నారు. కేవలం ఓపీ సేవలే అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ముందు రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్ సెంటర్లు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు 100 సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలతోపాటు ఉచిత బస్పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.