Pension For Farmers:- తెలుగు రాష్ట్రాల్లో రైతుల కోసం ప్రత్యేక పథకాలు నడుస్తున్నాయి. ఆ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబటి సాయం అందిస్తోంది. అటు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా కేవలం 4 శాతం వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా ఇస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా రైతుల కోసం పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా నెలకు 3వేల రూపాయలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ పథకం పేరు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ఈ స్కీమ్లో చేరిన రైతులు ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ అందుకోవచ్చు.
రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు ఈ పెన్షన్ స్కీమ్లో చేరొచ్చు. 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సులోపు ఉన్న రైతులు ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు. కాకపోతే, ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన స్కీమ్లో చేరిన రైతులు ప్రతీ నెల కొంత ప్రీమియం చెల్లించాలి. ఒక్కసారి పథకంలో చేరితే.. నెలకు రూ.3,000 చొప్పున ఏటా రూ.36,000 పెన్షన్ అందుకోవచ్చు.
రైతుల వయస్సును బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం రూ.55 నుంచి రూ.200 మధ్య ఉంటుంది. 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.200 ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
రైతులకు 60 ఏళ్లు దాటగానే కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తుంది. పాలసీ కొనసాగుతున్న సమయంలో రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి మిగతా ప్రీమియంలు చెల్లించి పెన్షన్ పొందవచ్చు. పెన్షన్ తీసుకుంటున్న రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది.
ఒకవేళ జీవిత భాగస్వామికి పెన్షన్ వద్దనుకుంటే చెల్లించిన డబ్బు వడ్డీతో సహా వెనక్కి వస్తుంది. ఇద్దరూ మరణించినట్టైతే నామినీకి డబ్బుల్ని చెల్లిస్తుంది.