Amarnath Yatra: శివోహం. శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర శంకర.. శివ శివ శంకర. శివభక్తులకు పరమ పవిత్రం అమర్నాథ్ క్షేత్రం. అపూర్వం. అనిర్వచనీయం. ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే దర్శనమిస్తుంది. హిమాలయ కొండల్లో.. అమర్నాథ్ గుహలో.. సహజంగా వెలుస్తుందా హిమలింగం. సాక్షాత్ శివుని స్వరూపమేనని నమ్ముతారు భక్తులు. అయితే, కేవలం భక్తి ఉంటే సరిపోదు. ఆ హిమలింగాన్ని దర్శించాలంటే సాహసోపేత యాత్ర చేయాలి. అందుకు ఆరోగ్యమూ సహకరించాలి. ముందుగా పేరు నమోదు చేసుకునే భక్తులను మాత్రమే అమర్నాథ్ యాత్రకు అనుమతిస్తారు. ఆ యాత్రకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉంటుంది అమర్నాథ్ క్షేత్రం. ఆ పుణ్యక్షేత్ర దర్శణకు చేపట్టే యాత్ర.. ఈయేడాది జులై 1న ప్రారంభం అవుతుంది. ఆగస్టు 31న ముగుస్తుంది. మొత్తం 62 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర సాగనుంది.
అమర్నాథ్ బోర్డు అధికారిక వెబ్సైట్లో కానీ, దేశవ్యాప్తంగా పలు బ్యాంకు శాఖల్లోగానీ యాత్రికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఏప్రిల్ 17 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
13 ఏళ్లలోపు పిల్లలు, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించరు. యాత్రలో పాల్గొనాలంటే.. ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి.
ఈ ఏడాది కూడా రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు.. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.