Best Online personal loan : ఇప్పుడన్నీ డిజిటల్ లోన్సే. పేపర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఒకటే ఆఫర్లు. జస్ట్ ఐదు నిమిషాల్లో కావాల్సినంత పర్సనల్ లోన్స్ ఇస్తామంటూ వెంటపడుతున్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ మధ్య ఈ బిజినెస్ బాగా పెంచాయి. ఎంతగా అంటే.. ప్రభుత్వరంగ, ప్రైవేట్ బ్యాంకులకు పోటీ ఇచ్చేంతగా. కస్టమర్లను ఆకర్షించేందుకు కొన్నిసార్లు రూల్స్ పక్కనపెట్టి, కడతారనే నమ్మకంతో లోన్స్ ఇచ్చేస్తున్నాయి. దీంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. వీటి మధ్య పోటీ పెరగడంతో.. వడ్డీరేట్లు కూడా తగ్గిస్తున్నాయి. మంచి క్రెడి్ట్ స్కోర్, గతంలో లోన్ రీపేమెంట్ హిస్టరీని బట్టి ఇంట్రస్ట్ రేట్స్ అప్లై చేస్తున్నాయి.
క్షణాల్లో లోన్స్ ఇస్తున్నాయి కదా అని ఏ సంస్థ పడితే ఆ సంస్థ నుంచి తీసుకోకూడదు. హిడెన్ ఛార్జెస్ వేస్తున్నాయా, మన డేటా సేఫేనా అనే విషయాలను ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లోన్ కండీషన్స్ ఏంటి, ఇంట్రస్ట్ రేట్ ఎంత, ముందే తిరిగి చెల్లించేస్తే పెనాల్టీ కట్టాల్సి ఉంటుందా, ప్రాసెసింగ్ ఫీజు ఎంత అనే వివరాలు తెలుసుకోవాలి. కాస్త పేరున్న సంస్థలనే ఎంచుకోవాలి. కస్టమర్ సర్వీస్ ఇస్తారా లేదా అనేది కనుక్కోవాలి.
పైగా ఎక్కువ లోన్స్కు అప్లై చేస్తే ఫైనల్ గా అది క్రెడిట్ స్కోర్ పైనే ఎఫెక్ట్ చూపిస్తుంది. అవసరానికి మించి అప్పులు చేస్తున్నట్టు రికార్డ్ అయితే.. మున్ముందు అవసరానికి లోన్స్ తీసుకోవడమే కష్టం కావొచ్చు. సో, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.
ప్రైవేట్ సంస్థలు పర్సనల్ లోన్స్ సెక్షన్లో దూసుకెళ్తుండడంతో.. బ్యాంకులు కూడా రంగంలోకి దిగాయి. కార్పొరేట్ లోన్లతో పోలిస్తే ఈ అన్సెక్యూర్డ్ లోన్లు సుమారు రెండింతలు పెరిగాయి. కాకపోతే.. నాన్ బ్యాంకింగ్ సంస్థల్లా కాకుండా.. గవర్నమెంట్ ఎంప్లాయిస్, క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నవారినే టార్గెట్ చేసి, వారికే ఎక్కువగా లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఆదాయం కోసం బ్యాంకులు సైతం కాస్త రిస్క్ తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లోన్లు ఇవ్వడంలో ఫాస్ట్గా ఉన్నాయి.
ముఖ్యంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా పెంచడంతో హోమ్ లోన్స్, కార్పొరేట్ లోన్స్, మార్ట్ గేజ్ లోన్స్ తీసుకునే వారు తగ్గిపోయారు. దీంతో బిజినెస్ పెంచుకోడానికి బ్యాంకులు పర్సనల్ లోన్లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బ్యాంకులు ఇచ్చిన అన్సెక్యూర్డ్ లోన్లు రూ. 2.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.