Traffic Police : మహారాష్ట్రలోని నవీ ముంబై అత్యంత రద్దీ ప్రాంతం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు కోపర్ఖెరాణె-వాశీ మార్గంలో తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించాడు. సిద్ధేశ్వర్ మాలి అనే ట్రాఫిక్ పోలీసు, మరో పోలీసుతో కలిసి ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మాదకద్రవ్యాలు తీసుకున్నాడన్న అనుమానంతో డ్రైవర్ ను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆ డ్రైవర్ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు సిద్ధేశ్వర్ మాలి కారు బానెట్పై పడిపోయాడు.
ఆ పోలీసు కారు బానెట్ పై ఉన్నా సరే ఆ డ్రైవర్ వేగంగా దూసుకెళ్లిపోయాడు. అలా 20 కిలోమీటర్లు తీసుకుపోయాడు. కారును గట్టిగా పట్టుకున్న సిద్ధేశ్వర్ మాలి.. 20 కిలోమీటర్ల వెళ్లిన తర్వాత గవ్హాన్ ఫాటా ప్రాంతంలో కింద పడిపోయాడు. ఆ కారును వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు ఆ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని 22 ఏళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. అతడు మాదకద్రవ్యాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. అతడిపై హత్యాయత్నం, ర్యాష్ డ్రైవింగ్, డ్రగ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో తరచూ జరుగుతున్నాయి. నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా తమ వాహనాలతో దూసుకుపోతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు నిందితుల వాహనాల్లో చిక్కుకుపోయిన సందర్భంలోనే ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.