Taxidermic birds:- మరణించిన ఏ జీవి అయినా మళ్లీ ప్రాణాలతో బ్రతికే అవకాశం ఉందా..? ఈరోజుల్లో మరణించిన మనుషులకు తిరిగి ప్రాణం పోయాలని శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి పూర్తిగా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు మరణించిన పక్షులకు ప్రాణం పోస్తున్నారు. కానీ పూర్తిగా వాటిని ప్రాణాలతో బ్రతికించడం లేదు. మరణించిన తర్వాత కూడా పక్షుల సామర్థ్యాన్ని ఉపయోగించి వాటికి జీవం ఉన్నట్టుగా అందరినీ నమ్మిస్తున్నారు.
పక్షుల సామర్థ్యాన్ని స్ఫూర్తిగా తీసుకునే డ్రోన్స్ అనేవి తయారయ్యాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలావరకు రంగాల్లో ఈ డ్రోన్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా డ్రోన్స్ విషయంలో పరిశోధనలు చేయడం కోసం న్యూ మెక్సికోకు చెందిన శాస్త్రవేత్తలు చనిపోయిన పక్షుల శరీరాలను ఉపయోగించడం ఇతర శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటివరకు కేవలం బ్రతికున్న జీవరాశులు, జంతువులపైనే రకరకాల ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు.. మొదటిసారి చనిపోయిన పక్షి శరీరాన్ని ఇలాంటి ప్రయోగం కోసం ఉపయోగిస్తున్నారు.
మెకానికల్ బర్డ్ డ్రోన్స్ పేరుతో తయారు చేయబడిన డ్రోన్స్ అంత మెరుగ్గా పనిచేయకపోవడం వారికి చనిపోయిన పక్షుల శరీరాన్ని ఉపయోగించాలనే ఆలోచన వచ్చిందని మెక్సికో శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా తయారు చేసిన డ్రోన్ చూడడానికి అచ్చం పక్షిలాగానే ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే విమానాల ప్యాటర్న్స్లో వీటిని ఉపయోగించవచ్చని వారు తెలిపారు. దీని వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా చాలారకాల మార్పులు వస్తాయన్నారు.
ప్రస్తుతం యూనివర్సిటీలోని ఒక పంజరంలో చనిపోయిన పక్షులపై పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు పక్షులు అంతసేపు అలసిపోకుండా ఆకాశంలో ఎలా ఎగరగలుగుతున్నాయి, వాటికి ఎనర్జీ ఎక్కడనుండి వస్తుంది అనే విషయాలను కనిపెడితే.. భవిష్యత్తులో ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఫ్యూయెల్ను ఉపయోగించుకుండా ఏవియేషన్ ఇండస్ట్రీ పనిచేసేలా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలుగా బర్డ్ డ్రోన్ అనేది కేవలం 20 నిమిషాలు మాత్రమే గాలిలో ఎగరగలదు. అలా కాకుండా ఎక్కువసేపు ఇది గాలిలో ఉండేలాగా వారు ప్రయత్నాలు చేయనున్నారు.