kejriwal: డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేశారు. ఇప్పుడు సీఎంను కార్నర్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూసుకుపోతుంది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ను 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. లిక్కర్ పాలసీ రూపొందించిన విధానం.. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు.. ఇలా అన్ని కోణాల్లో పలురకాల ప్రశ్నలు సంధించింది. విచారణను ఆడియో, వీడియోలో రికార్డు చేశారు. కేజ్రీవాల్ నుంచి రాతపూర్వక స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే, ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే కేజ్రీవాల్ను ప్రశ్నించింది సీబీఐ.
విచారణ తర్వాత సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్.. దర్యాప్తు సంస్థ తీరుపై మండిపడ్డారు. సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని.. తనను 56 ప్రశ్నలు అడిగారని.. మళ్లీ విచారణకు రమ్మని పిలువలేదని చెప్పారు. ఆప్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలా చేస్తున్నారని.. ప్రాణం పోయినా నీతి తప్పనన్నారు అర్వింద్ కేజ్రీవాల్.
దర్యాప్తు సంస్థలు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అంతుచిక్కడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆమెను మూడు సార్లు ప్రశ్నించి వదిలేశారు. వరుసగా రెండురోజులు సుదీర్ఘంగా విచారించారు. కవిత ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులోని డేటా రికవరీ చేసి పరిశీలించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత రోల్ ఏంటనేది ఇప్పటికీ సస్పెన్సే.
అదే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విషయంలో అలా జరగలేదు. ఇలా పిలిచారు.. అలా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచీ జైల్లోనే ఉంచారు. బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. ఇదే కేసులో.. సిసోడియా అరెస్ట్.. ప్రస్తుతానికైతే కవిత, కేజ్రీవాల్ సేఫ్. మరి, ముందుముందు?