Odisha Satellite:- సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందడం కోసం కేవలం దేశాల మధ్య మాత్రమే కాదు.. దేశంలోని రాష్ట్రాల మధ్య కూడా పోటీ పెరుగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వనరులను ఉపయోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించాలని చాలా రాష్ట్రాల శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అందులో ఒడిశా కూడా ఒకటి. ఒడిశా తయారు చేసిన సరికొత్త శాటిలైట్ త్వరలోనే అంతరిక్షంలోకి ఎగరడానికి సిద్ధమవుతోంది.
క్యూబ్శాట్ పేరుతో ఒడిశా తయారు చేసిన శాటిలైట్ త్వరలోనే అంతరిక్షంలోకి వెళ్లి ప్రకృతి విపత్తులను ముందే పసికట్టడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. భూవనేశ్వర్లోని సిలికాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగుళూరులోని క్రిస్టెల్లార్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో కలిసి ఈ శాటిలైట్ను తయారు చేశారు. చాలామంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్లు, విద్యార్థులు, నిపుణులు.. ఈ తయారీలో పాల్గోనున్నారు.
ఇస్రో స్వయంగా ఒడిశాకు చెందిన క్యూబ్శాట్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపనుందని సమాచారం. ఈ శాటిలైట్ తయారీ కోసం సిలికాన్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా రెండు అల్ట్రామోడర్న్ లేబురేటరీలు ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది. ఈ లేబురేటరీలలో స్పేస్ సైన్స్, వాతావరణ మార్పులు, సోలార్ సిస్టమ్ వంటి అంశాలపై కూడా పరిశోధనలు జరగనున్నాయి. కేవలం నిపుణులను మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా ఈ ప్రయోగాలలో భాగం చేసుకుంటామని సిలికాన్ ఇన్స్టిట్యూట్ బయటపెట్టింది.
లోవర్ ఆర్బిట్లోకి క్యూబ్శాట్ శాటిలైట్ను పంపించాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే వాతావరణ మార్పులను, వ్యవసాయంపై ప్రభావాన్ని తెలుసుకోవడం ముఖ్యమని, అందుకే లోవర్ ఆర్బిట్ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిన్న శాటిలైట్ బరువు దాదాపు ఒకటిన్నర కిలోలు ఉంటుంది. హై పవర్ కెమెరాలతో పాటు, సెన్సార్లు కూడా ఇందులో ఏర్పాటు కానున్నాయి. సోలార్ రేడియోషన్ ద్వారా ఇది ఎనర్జీని సేకరిస్తుంది.
క్రిస్టెల్లార్ ఏరోస్పేస్తో చేతులు కలపడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటూ సిలికాన్ ఇన్స్టిట్యూట్ బయటపెట్టింది. ఈ శాటిలైట్ అనేది ఒడిశాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఒడిశాలోని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుందని తెలిపింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉందని చెప్పింది. అందుకే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల దృష్టి ఈ మేడ్ ఇన్ ఒడిశా శాటిలైట్పై పడింది.