Viveka Murder Case: చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని కూలగొట్టిన అంశాల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఒకటి. ప్రత్యర్థులు కాపు కాసి మాటువేసేందుకు వీల్లేని పులివెందులలో.. సొంతింట్లో హత్యకు గురయ్యారు మాజీ మంత్రి వివేకానందరెడ్డి. ఈ మర్డర్ ఎవరిపని? ప్రభుత్వ వైఫల్యమంటూ నాడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. ఈకేసు మళ్లీ అంతే పొలిటికల్ ప్రాధాన్యంతో క్లయిమాక్స్కు చేరిందనే చెప్పాలి.
2019 మార్చి 15న హత్యకు గురయ్యారు వైఎస్ వివేకానందరెడ్డి. ఎవరు చంపారో ఇప్పటివరకు తేలలేదు. సీబీఐ వ్యవహార శైలిపైనా అనుమానాలు వచ్చాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్లింది ఈ కేసు. దర్యాప్తు అధికారిని మార్చాలన్న పిటిషన్ పై విచారణ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. ఏప్రిల్ 30లోపు విచారణ పూర్తిచేయాలంటూ అల్టిమేటం జారీ చేసింది. దీంతో.. సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విచారణ చేస్తున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కడప ఎంపీ అవినాశ్రెడ్డి చుట్టూ తిరుగుతోందా? ఎంపీని కింగ్పిన్గా సీబీఐ అనుమానిస్తోందా? వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఔననే సమాధానం వస్తుంది. అవినాశ్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకొచ్చారు సీబీఐ అధికారులు. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డినీ అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.
వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం చిన్న విషయమేమీ కాదు. ఆయన రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీ తండ్రి. అంతకంటే ఎక్కువగా.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు. ఈ కేసులో సీఎం జగన్పైనా ఆరోపణలు లేకపోలేదు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ విపక్షాలు ఓ రేంజ్లో విమర్శలు గుప్పించిన కేసు ఇది. అందుకే.. వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం ప్రభుత్వంలోను ప్రకంపనలు రేపుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. అనంతపురం జిల్లా నార్పలలో సోమవారం జరగాల్సిన కార్యక్రమాన్ని సైతం ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. పైకి మాత్రం అనివార్య కారణాల వల్ల సీఎం జగన్ రావడంలేదని శింగనమల ఎమ్మెల్యే కార్యాలయం అధికారిక ప్రకటన చేసినా.. అసలు విషయం మాత్రం వైఎస్ వివేకా కేసులో సీబీఐ దూకుడేనని చెప్తున్నారు. మరి, సీబీఐ యాక్షన్ పార్ట్.. భాస్కర్రెడ్డితోనే ఆగుతుందా? ఎంపీ అవినాశ్రెడ్డి అరెస్ట్ తప్పదా? ఇంకా పెద్దల వరకూ వెళుతుందా?