Fire Accident: హైదరాబాద్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు నగరవాసుల్ని భయపెడుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్మాల్, స్వప్నలోక్ ఘటనలు మరువకముందే మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడలోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. సరైన జాగ్రత్తలు లేకుండా నిర్వహిస్తున్న టింబర్ డిపో అగ్ని ప్రమాదానికి… పక్కింట్లోని ముగ్గురు అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటనలో దంపతులు సహా… అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సాయినగర్కాలనీలోని టింబర్ డిపోలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. టింబర్ డిపోలోని గ్యాస్ సిలిండర్ పేలుడుతో మంటలు తీవ్రమయ్యాయి. అక్కడ మొదలైన మంటలు క్రమంగా పక్క భవనంలోకి వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో… దట్టంగా అలుముకున్న పొగలు అలుముకున్నాయి. ఆ పొగకు ఊపిరాడక పక్కింట్లోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నరేష్, సుమ అనే ఇద్దరు భార్యభర్తలు సహా వారి కుమారుడు జోషిత్ ప్రాణాలు కోల్పోయారు.
టింబర్ డిపోలో అగ్నిప్రమాదంతో ఓ వలస కుటుంబం బలైంది. సూర్యాపేట జిల్లా రెడ్డిగూడెంకు చెందిన నరేష్… నగరంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సుమ ఇంట్లోనే ఉంటుండగా… ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ జీవితం గడుపుతున్నారు. అంతా హాయిగా గడుస్తుందనుకున్న సమయంలో… ఆ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. అగ్ని రూపంలో వారి ప్రాణాలు బలి తీసుకుంది. ఆ సమయంలో నరేశ్ పెద్ద కుమారుడు సమీపంలోని బంధువుల ఇంట్లో ఉండటంతో చావు నుంచి బయటపడ్డాడు.
అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబానికి GHMC మేయర్ 6 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రమాదాలు జరిగిన ప్రతీసారి ప్రభుత్వం పరిహారంతో సరిపెడుతోంది. నిబంధనలు గాలికొదిలేసిన పట్టించుకోని అధికారులు… ప్రమాదం జరిగినప్పుడు మాత్రం స్పందిస్తున్నారు. తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అసలు ప్రమాదాలు అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి సమాధానం ఎవరు చెబుతారని పలువురు అంటున్నారు. నరేష్ కుటుంబంలో ఒంటరిగా మిగిలిన చిన్నారిని దిక్కెవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలపై దృష్టిసారిస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.