Miss india : ఈ ఏడాది ఫెమీనా మిస్ ఇండియా పోటీలు ఆసక్తిగా సాగాయి. ఆదివారం రాత్రి మణిపూర్లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. ఈ ఈవెంట్ లో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై డ్యాన్స్ చేసి అలరించారు. 2022 మిస్ ఇండియా విజేత సినీ శెట్టి, స్టార్స్ రుబెల్ షెకావత్, షింతా చౌహాన్, మానస వారణాసి, మనికా షియోఖండ్, మాన్యా సింగ్, సుమన్ రావు, శివానీ జాదవ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు.. సినీసెలబ్రిటీలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
అన్ని పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్త విజేతగా నిలిచింది. మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి .. నందిని గుప్తకు కిరీటాన్ని అలంకరించింది. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా మొదటి రన్నరప్గా, మణిపూర్కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ రెండో రన్నరప్గా నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఏపీ నుంచి గోమతి, తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహాన్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు.
59వ ఫెమీనా మిస్ ఇండియా కిరీట కోసం ఢిల్లీ సహా 29 రాష్ట్రాలకు చెందిన యువతులు పోటీపడ్డారు. బ్యూటీతోనేకాదు టాలెంట్ తోనూ జడ్జిల ప్రశంసలు అందుకున్నారు. తుది పోరులో ఆకట్టుకున్న నందిని గుప్త కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ ఇండియాగా నిలవడంపై ఆనందం వ్యక్తం చేసింది.