Kejriwal : తాను ఎలాంటి తప్పు చేయలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో దాచిపెట్టడానికి ఏమీ లేదన్నారు. సీబీఐ ముందు అన్నీ వాస్తవాలే చెబుతానని తెలిపారు. ఆదివారం విచారణకు హాజరుకావాలని శుక్రవారం సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అంతకుముందు బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కేంద్రంలో ఉన్న పెద్దలు చాలా శక్తిమంతమైనవారని ఎవరినైనా జైలుకు పంపగలరని కేజ్రీవాల్ ఆరోపించారు. తనను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. బహుశా సీబీఐను ఆ పార్టీ అలా ఆదేశించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ అలా ఆదేశిస్తే సీబీఐ తనను ఎందుకు అరెస్టు చేయకుండా ఉంటుందని అన్నారు. బీజేపీ నేతలకు అధికారం వల్ల అహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు. వారికి అనుకూలంగా లేని మీడియా, న్యాయమూర్తులు ఇలా ఎవరిపైనైనా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారి మాట వినకపోతే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అవతరించే సత్తా భారత్కు ఉందని కేజ్రీవాల్ అన్నారు. కానీ దుష్ట రాజకీయాల వల్ల దేశం వెనుకబడిందని మండిపడ్డారు. భారత్ను ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలబెట్టడమే తన జీవిత లక్ష్యమని స్పష్టంచేశారు. ఇక దేశాభివృద్ధిని విద్రోహులు అడ్డుకోలేరన్నారు. తాను అవినీతిపరుడినైతే ప్రపంచంలో నిష్కళంకులెవరూ ఉండబోరని వ్యాఖ్యానించారు. జీవితాంతం తాను దేశం కోసమే జీవిస్తానని.. చివరకు దేశం కోసమే మరణిస్తానని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై నేతలకు అసలు పట్టింపు లేదని కేజ్రీవాల్ అన్నారు. నిరంతరం దుష్ట రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తనను జైల్లో పెట్టడం వల్ల దేశంలోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయా? అని ప్రశ్నించారు. 8ఏళ్ల తన పాలనలో ఢిల్లీలోని పాఠశాలలను మెరుగుపర్చానని తెలిపారు. గుజరాత్లో 30 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క స్కూల్నైనా బాగుచేశారా? అని నిలదీశారు. ఢిల్లీలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి అందరికీ మెరుగైన వైద్యసేవలు అందజేస్తున్నామని తెలిపారు. మరి 15 ఏళ్ల నుంచి మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.