TTD Darshan Tickets : తిరుమలకి నడక దారిలో వచ్చే భక్తులకి టీటీడీ శుభవార్త వినిపించింది. దివ్యదర్శనం టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా లేని పక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబోమని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలని, అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు యధా ప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. వాహనాల్లో తిరుమలకు చేరుకునే భక్తులు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తారు.
టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను టీటీడీ నిషేధించింది. తాజాగా భక్తులకు రాగి, స్టీల్ వాటర్ బాటిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీ పద్మావతి విచారణ కేంద్రంలో రాగి, స్టీల్ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చారు. రాగి వాటర్ బాటిల్కు రూ.450.. అదే స్టీల్ వాటర్ బాటిల్కు రూ.200లకు అందిస్తున్నారు.
ఈ ప్రయత్నం విజయవంతమైతే తిరుమల వ్యాప్తంగా విచారణ కేంద్రాల్లో బాటిళ్ల అమ్మకాలను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. మే 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. ఉత్సవాలను నిర్వహించేందుకు ఎస్వీబీసీ , ఇంజినీరింగ్, శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు