Modi vs KCR(National News): సందర్భం 1: గుజరాత్ నర్మదా నదీ తీరాన.. 3వేల కోట్ల ఖర్చుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన.. 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’. ప్రధాని మోదీచే అట్టహాసంగా ఆవిష్కరణ. వైమానిక దళ విమానాలతో పూల వర్షం.
సందర్భం 2: హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరాన.. 150 కోట్ల ఖర్చుతో దేశంలోకే ఎత్తైన.. 125 అడుగుల కాంస్య విగ్రహం. ఘనంగా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. హెలికాప్టర్లతో పూలవర్షం.
పైపైన చూస్తే ఈ రెండు ఘటనలు అసలేమాత్రం సంబంధంలేని విషయాలు. కానీ, రాజకీయంగా కీలకాంశాలు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ పక్కా కాంగ్రెస్ నేత. గుజరాత్కు చెందిన ఉక్కుమనిషి. అయితే, గాంధీ, నెహ్రూల ప్రాభవంలో పటేల్కు దక్కాల్సినంత ప్రాధాన్యాత దక్కలేదని అంటారు. ఇక, గుజరాతీయుడైన మోదీ.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ను ఓన్ చేసుకునే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. పటేల్కు ప్రాధాన్యం ఇస్తూ.. ఆయన్ను బీజేపీ ఖాతాలో కలిపేస్తున్నారు.
కట్ చేస్తే.. సీఎం కేసీఆర్ ఈ మధ్య తరుచూ బీఆర్ అంబేద్కర్ పాట పాడుతున్నారు. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు. తాజాగా, దేశంలోకే ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. అంబేద్కర్ను ఓన్ చేసుకోవడంలో మరో ముందడుగు వేశారు.
వల్లభాయ్ పటేల్కు ప్రాధాన్యం ఇచ్చి.. కాంగ్రెస్ను దెబ్బకొట్టడమే మోదీ ఎత్తుగడ అంటారు.
అంబేద్కర్ను నెత్తిన పెట్టుకుని.. దళితులను ఆకర్షించడమే కేసీఆర్ స్ట్రాటజీ అని చెబుతారు.
అయితే, ఈ ఇద్దరు నేతలు.. జాతి ప్రయోజనాల కోసమో, లేదంటే తమ ప్రయోజనాల కోసమో తెలీదు కానీ.. విగ్రహాలనే వ్యూహాలుగా ఎంచుకోవడం ఆసక్తికరం. మోదీ స్టాట్యూ ఆఫ్ పటేల్తో మెప్పిస్తే.. కేసీఆర్ స్టాట్యూ ఆఫ్ అంబేద్కర్తో ఆకట్టుకుంటున్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ రెండు విగ్రహాల రూపశిల్పి ‘రామ్ వి సుతార్’.
మరి, విగ్రహాలు ఓట్లు రాలుస్తాయా? ప్రత్యర్థి ఓటు బ్యాంకును దెబ్బ తీస్తాయా? రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తాయా? కేసీఆర్ను దేశ్కి నేతా చేస్తుందా? ఇవేవీ జరక్కున్నా.. ఆ విగ్రహాలు ఉన్నంత కాలం.. వారి పేరు చరిత్రలో నిలిచిపోతుందనా? ఏమో.