Jagan: ‘జగనన్నే మా భవిష్యత్తు’. వైసీపీ కొత్త నినాదం. ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీస్తున్నారు. వారి ఇంటి గోడపై జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ అంటిస్తున్నారు. అలా రాష్ట్రమంతా జగన్ మయం చేయాలనేది పార్టీ స్ట్రాటజీ.
వైసీపీ వాళ్లైతే ఎంచక్కా జగన్ స్టిక్కర్ అంటించుకుంటారు. మరి, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్లు ఎందుకు ఊరుకుంటారు? అదే జరుగుతోంది. ఏపీలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. తాజాగా, విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలో పెద్ద గొడవే జరిగింది.
‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా జగనన్న స్టిక్కర్లను అతికించడానికి అగురువీధికి వెళ్లారు వైసీపీ నాయకులు. అయితే, జగన్ స్టిక్కర్లు అంటించడానికి ఆ వీధి వాళ్లు ఒప్పుకోలేదు. ఎందుకు అంటించొద్దు అని అధికార పార్టీ వాళ్లు ప్రశ్నిస్తే.. మాకిష్టం లేదంటూ సమాధానం చెప్పారు. స్టిక్కర్లు వేసుకోకపోతే సంక్షేమ పథకాలు అపేస్తాం అంటూ వైసీపీ వర్గీయులు బెదిరించారు. ఎందుకు ఆపుతారు? అంటూ ఎదురు ప్రశ్నించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ తర్వాత సద్దుమనిగింది. విషయం తెలిసి టీడీపీ జిల్లా నేతలు ఆ వీధివారిని కలిసి మద్దతు తెలిపారు.
మరోవైపు.. కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ పథకాలేవి తమకు అందటంలేదంటూ… కర్నూల్ జిల్లా ప్యాలకుర్తిలో అలీం భాష అనే యువకుడు తన ఇంటికి అంటించిన జగన్ స్టిక్కర్ను చింపేశాడు. సర్కార్ నుంచి సంక్షేమ పథకాలు రానప్పుడు జగన్ స్టిక్కర్ ఎందుకంటూ పీకేశాడు. అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇలా ఏపీ వ్యాప్తంగా జగనన్న స్టిక్కర్ల రచ్చ నడుస్తోంది.