Covid: కొత్త వేరియంట్ కారణంగా దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే వేల మంది కొవిడ్ బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 11వేల 109 మందికి వైరస్ సోకింది. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 50 వేలకు చేరుకుంది. గురువారంతో పోలిస్తే 9 శాతం కొవిడ్ కేసులు పెరిగాయి.
కొవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పరీక్షల సంఖ్య పెంచడంతోపాటు టీకాలను వేగవంతం చేయాలని నిర్ణయించాయి. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించేలా చర్యలు తీసుకుంటున్నాయి.
మరోవైపు కొవిడ్ కేసులు పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… కానీ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు.