Donate:- మనం ఏ వస్తువునూ అవసరానికి మించి కోరకూడదు. ఒక వస్తువును కొనేటప్పుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చో అంత తక్కువ ధరలో కొంటాం. కానీ ఆ వస్తువు మనకు అవసరమో, కాదో ఆలోచించం. జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. దానికి కావాల్సిన ధనం మాత్రం సంపాదిస్తే సరిపోతుంది. ఈ విషయం మనం గుర్తించగలిగితే మన ఆచారాలు, అనుష్టానాలు వదులుకొని దెశాంతరాలకు పోయి మరి విస్తార ధనార్జన చేయవలసిన అవసరం ఏర్పడదు.
ఆత్మవిచారానికీ, ఈశ్వరధ్యానానికీ, పరోపకారానికీ మనకు కావలసినంత సమయం కావాలంటే అవసరాలకు మించి వస్తువులను సముపార్దించే కోరికలను వదిలిపెట్టాలి. పొదుపు వస్తువుల విషయంలోనే కాదు సంభాషణల్లోనూ అలవరచుకోవాలి. పదిమాటల్లో చెప్పవలసిన విషయాన్ని ఒక్కమాటలో చెప్పగల సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి. మౌనం వల్ల విభేదాలు, గొడవలు పడే అవకాశమే ఉండదు కదా! మితభాషణ వల్ల మనశ్శాంతి, ఆత్మశ్రేయస్సూ వృద్ధి చెందుతాయి
నిజానికి అన్ని కోరికలూ సంకల్పం వల్లనే కలుగుతుంటాయి. కొత్త, కొత్త సంకల్పాలు ఉదయించకుండా చూసుకుంటే కోరికలూ క్రమ క్రమంగా క్షీణిస్తాయి. కోరికలు తగ్గిపోయే కొద్దీ మన కార్యక్రమాలు, ధనార్జన, వస్తు సంపాదన తగ్గుతూ వస్తాయి. సంకల్పాలు క్షీణించాలంటే సద్వస్తువులపై దృష్టి పెట్టాలి. అప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. మనం సంపాదించే ధనమంతా స్వార్థం కోసమే కాక దానధర్మాలకు కూడా వెచ్చించాలి.
లోకంలో ఎంతోమంది పేదలు కష్టపడుతూ ఉంటే, మనం వృథాగా ధనాన్ని ఖర్చుపెట్టడం పాపం. మన డబ్బుతో దీనుల కష్టాలను పొగొట్టగలిగితే అంతకన్నా పుణ్యకార్యం వేరే ఉండదు. ఇలా సంపద సద్విని యోగమయ్యే కొద్దీ మనకు లక్ష్మీకటాక్షం కూడా సమృద్ధిగా లభిస్తుంది.