KTR Latest Speech (TS News) : తెలంగాణలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. హైదరాబాద్లోని పంజాగుట్ట కూడలిలో బాబాసాహెబ్ విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. లేకపోతే తెలంగాణ లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు సాగుతున్నామన్నారు.
సీఎం కేసీఆర్ దమ్మున్న నేత అని కేటీఆర్ అన్నారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం ఆయనకే సాధ్యమైందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కూడా అంబేడ్కర్ పేరే పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. జాతికి దిశానిర్దేశం చేసేలా దాన్ని ఏర్పాటు చేశామన్నారు. స్థానికుల డిమాండ్ మేరకు పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్ పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. బాబాసాహెబ్ స్ఫూర్తితోనే తెలంగాణలో దళితబంధు పథకం అమలు చేస్తున్నామని స్పీకర్ పోచారం అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటున్నామని స్పష్టంచేశారు.