America : అమెరికాలోని టెక్సాస్ లో ఘోరం జరిగింది. 18 వేల ఆవులు మృత్యువాత పడ్డాయి. ఆ ఆవుల విలువ 36 మిలియన్ డాలర్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిమ్మిట్లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫామ్ లో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 10న ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.
డెయిరీఫామ్ లోని యంత్రాలు వేడెక్కడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.పేలుడు జరిగిన తర్వాత ఒక్కసారిగా మీథేన్ ఎక్కవగా విడుదల కావడం వల్లే గోవులు ప్రాణాలు కోల్పోయాయని అనుమానిస్తున్నారు. డెయిరీ ఫామ్ లో సాధారణంగానే మీథేన్ గ్యాస్ వెలువడుతుంది. నిల్వ ఉన్న పేడ నుంచి మీథేన్ గ్యాస్ వెలువడుతుంది.
ఈ ప్రమాదంలో డైరీ ఫామ్ లో పని చేస్తున్న ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో పాలు భద్రపరిచే గదిలో మహిళ చిక్కుకుపోవడంతో గాయాలతో బయటపడగలిగింది. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 2013 తర్వాత డెయిరీ ఫామ్ లో ఇంతపెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని జంతు సంరక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకే చోట పెద్ద సంఖ్యలో ఆవులు పెంచుతుంటారు. 15 వేల కంటే ఎక్కువ ఆవులు పెంచుతున్న ఫామ్ ను బార్గా పిలుస్తారు. ఇక్కడ పనులన్నీ యంత్రాల సాయంతోనే నడుస్తాయి. ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించేందుకు కొద్ది మంది పనివారు ఉంటారు.