Apple CEO in India : వచ్చే వారం యాపిల్ చీఫ్ టిమ్ కుక్ ఇండియాకు రాబోతున్నారు. నెక్ట్స్ వీక్.. యాపిల్ తన మొదటి రెండు రిటైల్ స్టోర్లను ఇండియాలో ఓపెన్ చేస్తోంది. వీటిలో ఒకటి ముంబైలో, మరొకటి న్యూఢిల్లీలో ప్రారంభించబోతోంది యాపిల్. వీటిని ప్రారంభించేందుకు టిమ్ కుక్ స్వయంగా వస్తారని తెలుస్తోంది.
మరోవైపు ఇండియాలో తయారవుతున్న మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్.. రికార్డ్స్ సృష్టిస్తోంది. చైనాలో కంటే భారత్లోనే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 7 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేశారు. గతంతో పోల్చితే ఈ ఉత్పత్తి రేటు మూడు రెట్లు ఎక్కువ. దీంతో స్మార్ట్ఫోన్ రంగంలో భారత్.. చైనా దాటి వేగంగా దూసుకెళ్తోంది.
ప్రస్తుతం 7 శాతం ఐఫోన్లను ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఫాక్స్కాన్, పెగాట్రాన్ కార్ప్ సంస్థలు యాపిల్ ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నాయి. నిజానికి 2021లో ఇండియాలో తయారైన ఐఫోన్లు 1 శాతం మాత్రమే. ఇప్పుడు ఈ వాటా 7 శాతానికి పెరిగింది.
ఐఫోన్ అంటే మేడిన్ చైనానే. ఇప్పటి వరకు ఐఫోన్లు ఎక్కువగా తయారైంది చైనాలోనే. కాని, అమెరికాతో వచ్చిన విభేదాల కారణంగా.. చైనాపై ఆధారపడడం తగ్గించుకుంటోంది. మిగిలిన దేశాలు కూడా చైనాలో ఉన్న తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ ఇండియానే డెస్టినేషన్. అలా ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లు ఇండియాకు వచ్చాయి. మరోవైపు తయారీ రంగం కోసం మోదీ ప్రభుత్వం.. ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యాపిల్ చైనాను కాదని భారత్లో ఉత్పత్తిని పెంచింది. ఈ ఉత్పత్తి ఇదే రేంజ్లో పెరిగితే… 2025 నాటికి మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతు భారత్లోనే జరగనుంది.
ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లు రావడంతో ఇండియాలో ఉద్యోగాలు కూడా పెరిగాయి. ఫాక్స్కాన్, విస్ట్రాన్ కార్ప్, పెగాట్రాన్ సంస్థలు ఐఫోన్ తయారుచేస్తున్నాయి. ఈ మూడు కంపెనీల్లో దాదాపు 60వేల మంది పనిచేస్తున్నారు.