Diwali : దీపావళి. భారత్ లోకే అతిపెద్ద పండగ. దేశమంతా దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. లక్ష్మీ దేవి పూజలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. అమావాస్య చీకట్లు చీల్చుతూ.. ఆకాశంలో బాణాసంచా వెలుగులు.. పండు వెన్నెలను ఆవిష్కరిస్తాయి. నరకాసుర వథతో చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటారు.
ఇండియాలో ఇంత ఘనంగా దీపావళి వేడుకలు జరగడం ఆశ్చర్యమేమీ కాదు. కానీ, అగ్రరాజ్యమైన అమెరికాలోనూ మన దివాళీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుండటం భారతీయులకు గర్వకారణం. మన దేశ సంసృతి, సంప్రదాయాలకు విదేశాల్లో దక్కుతున్న గౌరవానికి నిదర్శనం.
ఏటేటా యూఎస్ అధ్యక్ష నిలయం వైట్ హౌజ్ లో దీపావాళి వేడుకలు జరుగుతుంటాయి. ఈసారి మరింత ఘనంగా నిర్వహించడం ఆసక్తికరం. జో బైడెన్ టీమ్ లోని ఇండో-అమెరికన్లు దివాలీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అమెరికా కల్చర్ లో దీపావళి సంతోషకరమైన వేడుకగా మారిందన్నారు జో బైడెన్. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కావడం.. పలువురు ఆసియా-అమెరికన్లు తన కార్యనిర్వాహక వర్గంలో ఉండటం.. వారి సామార్థ్యానికి లభిస్తున్న గుర్తింపు అని అన్నారు బైడెన్. హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు దీపావళి విషెష్ చెప్పారు. దీపావళి వేడుకల సందర్భంగా వైట్ హౌజ్ లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
100 కోట్ల మంది ప్రజలతో కలిసి బైడెన్ కార్యవర్గం కూడా దీపం వెలిగించి చెడుపై మంచి, అజ్ఞానంపై విజ్ఞానం, చీకటిపై వెలుతురు జరిపే పోరాటంలో భాగమైందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అన్నారు. శ్వేత సౌధం ఒక ప్రజాసౌధమన్నారు కమలా హ్యారిస్.
ఇక అమెరికాలో నివసిస్తున్న భారతీయ హిందువులు ఘనంగా దీపావళి జరుపుకున్నారు. వారి వారి ఇళ్లను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించుకున్నారు. అమ్మవారికి పూజలు చేసి.. స్వీట్స్ పంచారు. పలు అమెరికన్ కుటుంబాలు సైతం మన వారితో కలిసి దీపావళి వేడుకలతో పండగ చేసుకున్నారు.