cyber security in schools : సోషల్ మీడియా, ఇంటర్నెట్.. ఇలాంటివన్నీ మనిషికి సాయం చేస్తున్నట్టు కనిపించినా కూడా వీటిని తప్పుగా ఉపయోగించి సమాచారాన్ని, ప్రైవేట్ వివరాలను దొంగలిస్తున్న వారు కూడా ఉన్నారు. అందుకే ఇంతకు ముందుతో పోలిస్తే గత కొన్నేళ్లలో సైబర్ నేరాలు, నేరస్థులు ఎక్కువయిపోయారు. సైబర్ సెక్యూరిటీ సెల్స్ ఎంత చురుగ్గా పనిచేసినా.. వీరిని అదుపు చేయలేకపోతున్నాయి. అందుకే స్కూల్ నుండే సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన ఉండాలని నిపుణులు అంటున్నారు.
ఇంతకు ముందులాగా కాకుండా ఈరోజుల్లో పిల్లలకు స్కూల్ వయసు నుండే అన్ని ముఖ్యమైన విషయాలపై అవగాహన ఉండాలని తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నాయి. అందుకే చాలా విధాలుగా సిలబస్ అనేది పిల్లలకు ఉపయోగకరంగా ఉండేలా మారుతూ వస్తోంది. పిల్లలు పెద్దయ్యాక ఉపయోగపడే ఎన్నో విషయాలను స్కూల్ సిలబస్లో భాగం చేస్తున్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీని కూడా సిలబస్లో భాగం చేయాలని పలువురు ఉన్నతాధికారులు ఒక మీటింగ్లో తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ స్టూడెంట్స్ పేరుతో జరిగిన ఒక సమావేశంలో సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడం, దానిపై అవగాహన ఉండడం ఎంత ముఖ్యమనేదానిపై పలువురు నిపుణులు చర్చించారు. ఈరోజుల్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ను ఎందుకు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించకూడదు అనే అంశాలపై పూర్తిగా అవగాహన ఉండడం లేదని, అది వారిని సమస్యల్లో పడేస్తుందని తెలిపారు. అందుకే సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకుంటే స్మార్ట్ ఫోన్స్ వినియోగం గురించి కూడా ఆటోమేటిక్గా తెలుస్తుందని వారు భావిస్తున్నారు.
ఈ సమావేశంలో సైబర్ సెక్యూరిటీ గురించి తెలిపే రెండు బుక్స్ను కూడా విడుదల చేశారు. అవి విద్యార్థులకు అందజేయాలని కూడా కోరారు. ఈరోజుల్లో జరుగుతున్న సైబర్ నేరాలలో స్కూల్ విద్యార్థులు కూడా బాధితులు అవుతున్నారని గుర్తుచేసుకున్నారు. అందుకే వారిలో అవగాహన తీసుకురావడం కోసం మరెన్నో కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు.