Modi : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇరువురు ప్రధానులు కీలక అంశాలపై చర్చించారు. భారత్ వ్యతిరేక శక్తుల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని రిషి సునాక్ను మోదీ కోరారు. బ్రిటన్ లోని భారత దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తంచేశారు.
ఇటీవల బ్రిటన్ లో భారత హైకమిషన్పై జరిగిన దాడిని మోదీ ప్రస్తావించారు. ఖలిస్తానీ అనుకూలవాదులు లండన్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి చేశారు. భారత జాతీయ పతాకాన్ని అవమానించారు. ఈ ఘటనలను రిషి సునాక్తో మోదీ ప్రస్తావించారు. భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. భారత్ దౌత్య కార్యాలయాల భద్రత విషయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హామీ ఇచ్చారు.
దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్ లో తలదాచుకుంటున్న వారిని భారత్ కు అప్పగించే విషయంపై చర్చించారు. ఆర్థిక నేరస్తులను అప్పగించే ప్రక్రియలో పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాలను ప్రధానులు సమీక్షించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సత్వరం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగే జి-20 సదస్సుకు హాజరుకావాలని రిషి సునాక్ను మోదీ ఆహ్వానించారు.