IPL: ఐపీఎల్ -2023లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. గత మ్యాచ్ లో కోల్ కతా చేతిలో అనూహ్యంగా ఓడిన ఈ జట్టు తిరిగి పుంజుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మథ్యూ షార్ట్ (36), జితేశ్ శర్మ (25), శామ్ కరన్ (22), షారుఖ్ ఖాన్ (22) కాస్త రాణించారు. పంజాబ్ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోర్ సాధించకపోవడంతో ప్రత్యర్థి ముందు తక్కువ టార్గెట్ నే పెట్టింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మకు 2 వికెట్లు దక్కాయి. షమీ, జోష్ లిటిల్, జోసెఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(30, 19 బంతుల్లో 5 ఫోర్లు ), గిల్ (67, 49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. సాహా అవుటైనా గిల్ అదే జోరు కొనసాగించాడు. సాయి సుదర్శన్ (19), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ( 8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.
చివరి ఓవర్ లో టైటాన్స్ విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. రెండో బంతికి గిల్ అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. చివరి రెండు బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన తరుణంలో రాహుల్ తెవాటియా బౌండరీ కొట్టి గుజరాత్ ను గెలుపు తీరాలకు చేర్చాడు.
పొదుపుగా బౌలింగ్ చేసిన రెండు వికెట్లు తీసిన మోహిత్ శర్మకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు 4 మ్యాచ్ ల్లో 3 విజయాలతో గుజరాత్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ 4 మ్యాచ్ ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 6వ స్థానంలో ఉంది.