Dashavatars : గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలంలోని నంబూరులో దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రత్యేకమైంది. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా సువిశాల మైదానంలో సుందరంగా ఆలయం నిర్మించారు..ఈ ఆలయంలో భూసమేత దశావతార వేంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి, విష్వక్సేనాళ్వార్, గరుడాళ్వార్, హయగ్రీవాచార్యుల విగ్రహాలను అద్భుతంగా మలిచారు.
అవతారం అంటే పరమాత్మ లోకకల్యాణం కోసం మనిషి రూపాల్లో భూమికి దిగి రావడం… పురాణాలు ప్రకారం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమిపై 21 సార్లు అవతరించాడు. ఆయన అవతారాలలో అతి ముఖ్యమైనవి దశావతారాలు.
భారతదేశంలో శ్రీ మహావిష్ణువుకి చెందిన ఆలయాలు , వివిధ అవతారాలకు చెందిన ప్రముఖ ఆలయాలు ఎన్నో కలవు.కానీ మొత్తం దశావతారాలు ఓకే విగ్రహ రూపంలో నిక్షిప్తమై దర్శనమిచ్చే ఆలయం బహుశా భారతదేశంలోనే ఒకే ఒక్క ఆలయం తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు జిల్లాలోనే ఉంది. .
ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం 11 అడుగులు ఉంటుంది. దశావతార రూపంలో ఉండే ఈ 11 అడుగుల అద్భుత విగ్రహం కాళ్ళ నుండి నడుము వరకు వరాహ, మత్స్య, కూర్మ అవతారలలో ఉండగా మిగిలిన ఏడు అవతారాలు కూడా స్వామివారి విగ్రహంలో చాలా అందంగా భక్తులకి దర్శనమిస్తాయి.
శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ల వరకూ మత్స్యావతారంలో, నడుము వరకూ కూర్మావతారంలోనూ దర్శనమిస్తుంది. శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖం.. విగ్రహం ఎనిమిది చేతుల్లో వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, విల్లుమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించారు. మొత్తం ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రం ప్రకారం గణపతి సచ్చిదానందస్వామి పర్యవేక్షణలో జరిగింది.