Nandamuri Ramakrishna(Andhra Pradesh News) : గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబు పేరు చెబితే ఒంటికాలిపై లేస్తారు. సందర్భం ఉన్నా లేకున్నా ఏదో ఒక అంశంపై టీడీపీ అధినేతపై నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు. నందమూరి ఫ్యామిలీని మోసం చేశారని ఆరోపిస్తుంటారు. ఎన్టీఆర్ నుంచి సీఎం పదవిని, పార్టీని లాక్కున్నారని మండిపడుతూ ఉంటారు. తాను నందమూరి కుటుంబానికి విధేయుడేనని ఎన్నోసార్లు చెప్పారు.
హరికృష్ణ వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎప్పటి నుంచో కొడాలి నాని చెబుతున్నారు. కానీ చంద్రబాబుపై ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా నందమూరి కుటుంబ సభ్యులెవరూ కొడాలి నానిపై ఎప్పుడూ విమర్శలు చేయలేదు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలను ఖండించలేదు. వైసీపీ ప్రభుత్వంపై అప్పుడప్పుడు విమర్శలు చేసే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఎప్పుడూ కొడాలి నాని నేరుగా విమర్శించిన దాఖలాలులేవు. కానీ తొలిసారిగా నందమూరి కుటుంబంలోని ఓ వ్యక్తి కొడాలి నానిపై డైరక్ట్ గా విమర్శలు చేశారు.
కొడాలి నానిని పోషించింది… రాజకీయ భిక్ష పెట్టిందే నందమూరి వంశమని గుర్తుంచుకోవాలని ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేళ ఆ మహనీయుడి స్వగ్రామం కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరుకు ఆయన వచ్చారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు రామకృష్ణ పూలమాలలు వేశారు. ఈ సమయంలో కొడాలి నానిపై విమర్శలు చేశారు. ఎవరు ఎవరిని మోసం చేశారో అతని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీని వాడుకుని అతడే నందమూరి కుటుంబాన్ని మోసం చేశాడని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వంపైనా రామకృష్ణ విమర్శలు చేశారు. అభివృద్ధిలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మండిపడ్డారు. అడుక్కోవడానికి చిప్పకూడా దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపటం చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఈ పర్యటనలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా పాల్గొన్నారు.
నందమూరి కుటుంబ సభ్యుడే నేరుగా విమర్శలు చేయడంతో మరి కొడాలి నాని ఎలా స్పందిస్తారో చూడాలి. రామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారా..? లేక చంద్రబాబే తనపై విమర్శలు చేయించారని పాతపాట పాడతారా..?