Corona Virus News : దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 2,29,958 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 10,158 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ముందురోజు కంటే 30 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 4.42 శాతానికి చేరింది. యాక్టివ్ కేసులు 44,998కి చేరుకుంది. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. 230 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,42,10,127 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. భారత్లో సగటున గత వారంలో రోజుకు 5,555 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారం రోజువారీ సగటు 3,108 కేసులుగా ఉంది.
దేశంలో కొవిడ్ ఎండమిక్ దశకు చేరుకుందని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. రెండువారాలపాటు కేసుల ఉద్ధృతి కొనసాగుతుందని తెలిపింది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఒమిక్రాన్, దాని ఉపరకమైన ఎక్స్బీబీ.1.16 కారణంగా కేసుల పెరుగుదల వేగంగా ఉంది. కేసులు పెరుగుతున్నా ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.